బీజింగ్: పై ఫొటోలో కనిపిస్తున్న ఆకాశహార్మ్యం చైనాలో ఉన్నది. ఈ 26 అంతస్తుల ఆకాశహార్మ్యం ఇటీవలే నిర్మాణం పూర్తిచేసుకుని వినియోగంలోకి వచ్చింది. అయితే, ఈ బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించింది మనుషుల ఆవాసానికో లేక వ్యాపార సముదాయాల కోసమో కాదు. పందుల పెంపకానికి. అవును మీరు చదవింది నిజమే. పందుల పెంపకం కోసం హుబీ ప్రావిన్స్లోని ఎజౌ పట్టణ శివార్లలో ఈ భారీ భవనాన్ని నిర్మించారు.
పందుల పెంపకం కోసం నిర్మించిన భవనాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద భవనంగా ఇది గుర్తింపు పొందింది. చైనాలో ప్రధాన మాంసాహారమైన పోర్క్ ఉత్పత్తిని పెంచడానికి, తక్కువ స్థలంలో ఎక్కువ ఉత్పత్తిని సాధించడానికి ఇలా బహుళ అంతస్తుల భవనాల్లో పందులను పెంచుతున్నారు. వాణిజ్యపరమైన ఎగుమతుల కోసం పందుల పెంపకంపై దృష్టిపెట్టిన చైనా ప్రభుత్వం.. ఇలా భారీ భవనాల్లో ఫార్మింగ్కు అనుమతించింది.
మొదట రెండుమూడు అంతస్తుల భవనాలతో మొదలైన పందుల ఫార్మింగ్ ఇప్పుడిలా 26 అంతస్తులకు చేరింది. ఈ భవనాల్లో పందులకు యంత్రాలే ఆహారాన్ని సరఫరా చేస్తాయి. గాలి శుద్ధీకరణకు, పందులకు ఇన్ఫెక్షన్స్ సోకకుండా అధునాతన పద్ధతులను పాటిస్తున్నారు. పందుల వ్యర్థాలతో బయోగ్యాస్, విద్యుత్ ఉత్పత్తి లాంటివి కూడా చేస్తున్నారు.
ఈ 26 అంతస్తుల భవనంలో నెలకు 54 వేల టన్నులు, ఏడాదికి 60 లక్షల టన్నుల పంది మాంసం ఉత్పత్తి జరుగుతుంది. ఏడాదికి 12 లక్షల పందులను పెంచి, మాంసం తీయడమే లక్ష్యంగా ఎనిమిది లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. ప్రస్తుతం 6.5 లక్షల పందులను ఇక్కడ పెంచుతున్నారు.
గతంలో యూరప్లోనూ ఇలాంటి నిర్మాణాలు చేపట్టినా వివిధ కారణాలతో వాటిలో చాలా భవనాలు మూతపడ్డాయి. ఉన్నవాటిలోనూ మూడంతస్తులకు మించి లేవు. అయితే ఇలా జనావాసాల మధ్య ఇంత భారీ స్థాయిలో పందుల పెంపకం చేపట్టడంవల్ల ప్రజల్లో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.