న్యూఢిల్లీ, ఏప్రిల్ 15 : అండమాన్ సముద్రంలో విషాదం చోటుచేసుకుంది. రోహింగ్యా శరణార్థ్ధులు, బంగ్లాదేశ్ పౌరులను తీసుకుని వస్తున్న పడవ బోల్తాపడిన ఘటనలో 250 మంది గల్లంతయ్యారు. రెఫ్యూజీస్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ యూఎన్ హై కమిషనర్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ బంగ్లాదేశ్లోని టెక్నాఫ్ నుంచి మలేషియాకు 250 మంది పురుషులు, మహిళలు, పిల్లలతో కిక్కిరిసి వస్తున్న ఒక పడవ ప్రతికూల వాతావరణం, ఓవర్లోడ్ కారణంగా అండమాన్ సముద్రంలో మునిగిపోయింది.
దీంతో అందులోని వారందరూ గల్లంతయ్యారు. ప్రతి ఏడాది వేలాది మంది రోహింగ్యాలు, మయన్మార్కు చెంది న ముస్లిం మైనారిటీలు హింసకు గురవుతూ, అణచివేత నుంచి తప్పించుకోవడానికి ప్రమాదకరమైన సముద్ర ప్రయాణాలు చేసి వేరే ప్రాంతాలకు తరలిపోతుంటారు. చాలామంది కాక్స్ బజార్లోని రద్దీగా ఉండే శరణార్థి శిబిరాల నుంచి పారిపోతారు. ఇక్కడ మయన్మార్లోని రఖైన్ రాష్ట్రం నుంచి తప్పించుకున్న 10 లక్షల మంది కంటే ఎక్కువ మంది ప్రజలు దుర్భర పరిస్థితుల్లో నివసిస్తున్నారు.