లండన్: మానవ ప్రగతికి సాంకేతిక ఆవిష్కరణ ప్రధాన వనరు. మనిషి జీవితాన్ని మార్చేయగల ఆలోచనలు కంప్యూటర్ వాడకంతో మరింత వేగంగా పరుగులు పెట్టాయన్నది నిర్వివాదాంశం. 1822లో చార్లెస్ బాబేజ్ కంప్యూటర్ భావనను ప్రపంచానికి పరిచయం చేశారు. అయితే 2,000 ఏండ్ల క్రితమే గ్రీకులు ఓ కంప్యూటర్ను తయారు చేశారన్న విషయం మీకు తెలుసా? ప్రపంచంలో మొట్టమొదటి కంప్యూటర్గా పిలుస్తున్న దాని మిస్టరీని తాజాగా పరిశోధకులు చేధించారు.
గ్రీసు తీరంలోని మధ్యధరా సముద్రంలో మునిగిపోయిన ఓ పురాతన ఓడలో 1901లో పరిశోధకులు ఓ పరికరాన్ని గుర్తించారు. క్రీస్తుపూర్వం 65వ సంవత్సరానికి చెందిన పురాతన గ్రీకులు దీన్ని తయారు చేసినట్టు ఒక నిర్ణయానికి వచ్చారు. దీని సాయంతో గ్రహ గమనాలు, సూర్య-చంద్రోదయాలు, జ్యోతిష శాస్త్రం, క్యాలెండర్, గణిత శాస్త్రం, గ్రహణాలు వంటి కచ్చితమైన వివరాలను వందల ఏండ్ల ముందుగానే కచ్చితంగా లెక్కగట్టేవారని పరిశోధనల్లో తేలింది. ‘యాంటికిథెరా’గా నామకరణం చేసిన ఈ పరికరాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటి అనాలజీ కంప్యూటర్గా పిలుస్తున్నారు.
దశాబ్దాల ముందుగా జరుగబోయే విషయాలను అంత కచ్చితంగా ‘యాంటికిథెరా’ ఎలా అంచనా వేయగలుగుతున్నదన్న అంశంపై పరిశోధకులు 120 ఏండ్లుగా పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. ‘యాంటికిథెరా’కు సంబంధించిన ముప్పావు శాతం అవశేషాలు ధ్వంసమవ్వడంతో ఈ కంప్యూటర్ వెనకున్న సూత్రం ఇప్పటివరకూ బయటపడలేదు. అయితే యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకులు 3 డీ ఇమేజింగ్ సాంకేతికతతో ‘యాంటికిథెరా’ను తాజాగా పునర్నిర్మించారు. దీని సాయంతో ‘యాంటికిథెరా’లో వాడిన మ్యాథమెటికల్ టేబుల్స్, అల్గారిథమ్స్ను కనుగొన్నారు. ‘ప్రస్తుతం మనం ఊహించిన దానికంటే అప్పటి పురాతన గ్రీకులు శాస్త్ర, అంతరిక్ష, గణిత శాస్ర్తాల్లో ఎంతో ముందున్నారు’ అని పరిశోధనల్లో పాలు పంచుకున్న ఆడమ్ వోజ్కిక్ తెలిపారు. ‘యాంటికిథెరా’ సాయంతో ఇంకా ఎన్ని రకాల సాధనలు చేసేవారో తెలుసుకోవాల్సి ఉన్నదన్నారు.3డీ ఇమేజింగ్ సాయంతో త్వరలోనే మరింత సమాచారం తెలుస్తుందన్నారు.