కీవ్/లండన్, జూన్ 2: తమ దేశ పౌరులను రష్యా బలవంతంగా తీసుకెళ్లిన వారిలో 2 లక్షల మంది చిన్నారులు ఉన్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆందోళన వ్యక్తం చేశారు. రష్యాలోని వివిధ ప్రాంతాలకు వారిని తరలించారని పేర్కొన్నారు. అనాథ శరణాలయాల్లో ఉన్నవారిని, తల్లిదండ్రులు, కుటుంబాల నుంచి వేరుచేసి మరీ వారిని లాక్కెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనంతటికీ కారణమైన వారిని త్వరలో ఉక్రెయిన్ తప్పకుండా శిక్షిస్తుందని, అయితే తొలుత యుద్ధంలో రష్యాకు తామేంటో చూపిస్తామని పేర్కొన్నారు.
రష్యా ఆక్రమణలో 20% ఉక్రెయిన్
తమ దేశంలోని 20% భూభాగాన్ని రష్యా తన అధీనంలోకి తీసుకుందని జెలెన్స్కీ తెలిపారు. ఉక్రెయిన్కు చెందిన 3,620 ప్రాంతాలను రష్యా అధీనంలోకి తీసుకున్నదని, అయితే వాటిలో 1,017 ప్రాంతాలను తమ బలగాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయని వివరించారు. మొత్తం 1.25 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని రష్యా స్వాధీనం చేసుకుందని చెప్పారు. ఖార్కీవ్లో రష్యా బలగాల షెల్లింగ్లో ఓ స్కూల్కు నిప్పంటుకుని ఓ మహిళ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.