లండన్: అట్లాంటిక్ మహాసముద్రంపై ప్రయాణిస్తున్న విలాసవంతమైన క్రూయిజ్లో ముగ్గురు వ్యక్తులు హంటా వైరస్(Hantavirus)తో మరణించిన విషయం తెలిసిందే. అయితే డచ్ వెసల్ ఎంవీ హొండియస్ క్రూయిజ్ సిబ్బందిలో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నట్లు తెలిసింది. ఆ నౌకలో మరో అయిదురు వ్యక్తులకు హంటావైరస్ సోకినట్లు తెలిసింది. ఓసియన్వైడ్ ఎక్స్పడీషన్ ఆ నౌకను ఆపరేట్ చేస్తున్నది. ఏప్రిల్ ఒకటో తేదీన అర్జెంటీనాలోని హుషుహియా నుంచి ఆ నౌక బయలుదేరింది. స్పెయిన్లోని కెనార ఐలాండ్లో మే 10వ తేదీ వరకు చేరుకోవాల్సి ఉంది. ఆ లగ్జజీ నౌకలో 150 మంది ప్రయాణికులు ఉన్నారు. 28 దేశాలకు చెందిన సిబ్బంది కూడా ఉన్నట్లు తెలిసింది. కానీ హంటావైరస్ సోకడం వల్ల ఏప్రిల్ 24వ తేదీన ఆ నౌకను సెయింట్ హెలినా దీవిలో నిలిపివేశారు.
క్రూయిజ్లో హంటా వైరస్ సోకిన అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. అనుమానిత 8 కేసుల్లో అయిదుగురికి వైరస్ కన్ఫర్మ్ అయినట్లు పేర్కొన్నది. కోవిడ్ లాంటి పరిస్థితులు ఇప్పుడు ఏమీ లేవని డబ్ల్యూహెచ్వో ఎపిడమాలజిస్ట్ మారియా వాన్ కేర్కోవ్ తెలిపారు. ఇది కోవిడ్ కాదు, ఇన్ఫ్లూయాంజా కాదు, ఇది చాలా భిన్నంగా వ్యాప్తి చెందుతుందని వాన్ కేర్కోవ్ చెప్పారు.క్రూయిజ్లో ఉన్న ప్రతి ఒక్కర్నీ మాస్క్ ధరించాలని చెప్పినట్లు వెల్లడించారు. సాధారణంగా ఎలుకల వల్ల హంటా వైరస్ వ్యాప్తి చెందుతుంది. కానీ మనుషుల ద్వారా ఆ వ్యాధి వ్యాప్తి అవుతున్నట్లు తొలిసారి నిర్ధారణ అయినట్లు డబ్ల్యూహెచ్వో అభిప్రాయపడుతున్నది.