న్యూయార్క్, మే 25: సమాజంపై పుట్టిన విరక్తి ముక్కుపచ్చలారని పసిమొగ్గల ప్రాణాలను బలిగొన్నది. దేశంలో పెచ్చరిల్లిన తుపాకీ సంస్కృతి తల్లిదండ్రులకు గుండెకోత మిగిల్చింది. ఓ ఉన్మాది సృష్టించిన ఘోర కలితో అగ్రరాజ్యం అమెరికా వణికిపోయింది. టెక్సాస్లో ఉవల్డే పట్టణంలోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్లో మంగళవారం ఉదయం 11.30 గంటలకు చొరబడిన 18 ఏండ్ల యువకుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 19 మంది పిల్లలు సహా మొత్తం 21 మంది మృతిచెందారు. మరణించిన చిన్నారుల వయస్సు 5-11 ఏండ్ల మధ్య ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడిని సాల్వడోర్ రామోస్గా గుర్తించినట్టు పేర్కొన్నారు. పోలీసుల కాల్పుల్లో దుండగుడు మరణించినట్టు తెలిపారు. హతుడి నుంచి ఓ తుపాకీ, రైఫిల్ను స్వాధీనం చేసుకొన్నామని, కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉన్నదని వెల్లడించారు.
దేశంలో కొనసాగుతున్న గన్ కల్చర్కు అమెరికన్లు వ్యతిరేకంగా నిలబడాల్సిన సమయం వచ్చిందని అధ్యక్షుడు జో బైడెన్ పిలుపునిచ్చారు. పిల్లల మరణంతో గుండెల్లో పుట్టుకొచ్చిన ఈ బాధను కఠిన చట్టాలుగా మార్చాలన్నారు. ఈ సందర్భంగా చనిపోయిన తన మొదటి భార్య, పిల్లలను గుర్తు చేసుకొన్నారు. చిన్నారుల మృతికి సంతాపంగా మే 28 వరకు జాతీయ పతాకాన్ని అవనతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు ఇక చాలని, దేశం మేల్కోవాల్సిన సమయం వచ్చిందని ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ అన్నారు. గత కొన్నేండ్లలో ఇది అత్యంత ఘోరమైన ఘటన అని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ పేర్కొన్నారు. ఘటనను సినీప్రముఖులు సెలేనా గోమేజ్, టెయిలర్ స్విఫ్ట్, ప్రియాంకా చోప్రా, ఆర్ మాధవన్ ఖండించారు.
నాయనమ్మతోనే నరమేధం మొదలు..
నరమేధానికి ముందు సాల్వడోర్ రామోస్ తన నాయనమ్మతో గొడవపడి ఆమెను కూడా కాల్చిచంపాడని అధికారులు తెలిపారు. స్కూల్లోని నాలుగో తరగతి గదిలోకి ప్రవేశించిన అతను కాల్పులు జరుపడానికి ముందు.. ‘మీరు చనిపోబోతున్నారు’ అంటూ గట్టిగా అరిచాడని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. దుండగుడు కాల్పులకు తెగబడుతున్న క్రమంలో తనను తాను రక్షించుకోవడానికి అమేరియా జో గర్జా అనే పదేండ్ల బాలిక 911 హెల్ప్లైన్కు ఫోన్ చేయడానికి ప్రయత్నించిందని, ఇంతలోనే రామోస్ ఆమెను బలితీసుకొన్నాడని పేర్కొన్నారు. కాగా, చిన్నప్పటి నుంచి ఆర్థిక సమస్యలు తలెత్తడం, తన చింపిరి జుట్టు, మురికి బట్టలను చూసి స్కూల్లో తోటి పిల్లలు ఎగతాళి చేయడంతో రామోస్ చదువును మధ్యలోనే ఆపేసినట్టు తెలుస్తున్నది. సమాజంపై అతను ఎప్పుడూ విరక్తితో ఉండేవాడని సన్నిహితులు తెలిపారు. పనిచేసేచోట కూడా ముభావంగా ఉండేవాడని, ఇటీవలే 18వ పుట్టిన రోజు జరుపుకొని కొత్త తుపాకీ, రైఫిల్ను కొన్నాడని పేర్కొన్నారు. కాల్పులకు ముందు ‘తుపాకులు ఎందుకు కొన్నానంటే.. ’ అంటూ సోషల్మీడియాలో నిందితుడు ఓ పోస్ట్ పెట్టినట్టు అధికారులు తెలిపారు.
కొంపముంచిన కొత్త చట్టం
టెక్సాస్లో గత సెప్టెంబర్లో తీసుకొచ్చిన చట్టం ప్రకారం.. 18 ఏండ్లు పైబడిన వ్యక్తులు ఆత్మరక్షణ కోసం తుపాకులు వాడొచ్చు. దీనికి లెసెన్స్ కూడా అవసరం లేదు. అయితే, ఆత్మరక్షణ, కుటుంబ రక్షణ, రేప్ల నుంచి రక్షణ వంటి బలమైన కారణాలతో తప్పనిసరి పరిస్థితుల్లోనే తుపాకీ వాడాలని తాజా చట్టంలో పేర్కొన్నారు. దీన్ని గ్రహించిన రామోస్ 18వ యేట రాగానే తుపాకీని కొనుగోలు చేసి ఈ ఘోరకలికి పూనుకొన్నాడు.