వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పుల మోతమోగింది. టెక్సాస్లోని ఉవాల్డేలో ఉన్న ఓ ప్రాథమిక పాఠశాలలో (Elementary school) 18 ఏండ్ల యువకుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో 21 మంది మరణించారు. వారిలో 18 మంది చిన్నారులు, ముగ్గురు పెద్దవారు ఉన్నారని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్ తెలిపారు. పోలీసుల కాల్పుల్లో ఆ యువకుడు హతమయ్యాడని వెల్లడించారు. గత పదేండ్లలో అమెరికాలోని స్కూళ్లలో జరిగిన కాల్పుల ఘటనల్లో అతిపెద్దది ఇదేనని అభిప్రాయపడ్డారు. టెక్సాస్ చరిత్రలో.. అత్యంత దారుణ కాల్పుల ఘటన అని ఆయన చెప్పారు.
సల్వడార్ రామోస్ అనే 18 ఏండ్ల యువకుడు మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఉవాల్డేలోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్లోకి ప్రవేశించాడు. తనవెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడని పోలీసులు చెప్పారు. దీంతో 21 మంది అక్కడికక్కడే చనిపోగా, పలువురు గాయపడ్డారని తెలిపారు. అయితే ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఆ స్కూల్ను చుట్టుముట్టారని, వారు జరిపిన కాల్పుల్లో గన్మ్యాన్ కూడా చనిపోయాడని వెల్లడించారు. కాల్పులకు గల కారణాలు తెలుసుకునేందుకు ఎఫ్బీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని ప్రభుత్వ భవనాలు, మిలటరీ స్థావరాలు, నావల్ స్టేషన్స్, అమెరికా రాయబార కార్యాలయాల వద్ద జాతీయ జెండాను మే 28 సాయంత్రం వరకు అవనతం చేయాలని ఆదేశించారు.
Texans are grieving for the victims of this senseless crime & for the community of Uvalde.
Cecilia & I mourn this horrific loss & urge all Texans to come together.
I've instructed @TxDPS & Texas Rangers to work with local law enforcement to fully investigate this crime. pic.twitter.com/Yjwi8tDT1v
— Greg Abbott (@GregAbbott_TX) May 24, 2022