Peru violence | దక్షిణ అమెరికా దేశమైన పెరూలో హింస చెలరేగింది. మాజీ అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లా మద్దతుదారులు, భద్రతా బలగాల మధ్య మంగళవారం హింసాత్మక ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణలో 17 మంది మృతి చెందగా.. 73 మంది గాయపడినట్లు సమాచారం. వీరిలో చాలా మంది మహిళలు ఉన్నారు. దాదాపు మూడున్నర కోట్ల జనాభా ఉన్న పెరూలో రాజకీయ విభేదాలు కొత్తేం కాదు. దాదాపు మూడేండ్లుగా పార్లమెంట్, రాష్ట్రపతి మధ్య వాగ్వాదం కొనసాగుతూనే ఉన్నది. ప్రభుత్వం దిగిపోయి తిరిగి ఎన్నికలు జరపాలని మాజీ అధ్యక్షుడు పెడ్రో మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కారణంగా అనేక సార్లు హింస ప్రజ్వరిల్లింది. అయితే, తొలిసారిగా ఇంత సంఖ్యలో ప్రజలు మరణించారు. దేశంలో త్వరలో ఎమర్జెన్సీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.
దాదాపు మూడేండ్లుగా పెరూలో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతున్నది. తాజా అల్లర్లకు ప్రధాన కారణమైన కేసు డిసెంబర్లో మొదలైంది. మంగళవారం వందలాది మంది నిరసనకారులు దక్షిణ పెరువియన్ అండీస్ నగరం పునోలోని ప్రధాన ప్లాజాపై గుమిగూడారు. వీరిని నివారించేందుకు భద్రతాదళాలు ప్రయత్నించడంతో హింస చెలరేగింది. మాజీ అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లా అవినీతి, ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయనపై కాంగ్రెస్లో వ్యతిరేకత మొదలై ఆయన రాజీనామా చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. పదవి నుంచి దిగేందుకు పెడ్రో ససేమిరా అనడంతో.. ప్రతిపక్షాలు అభిశంసనకు సన్నాహాలు ప్రారంభించాయి. పెడ్రోపై గతంలో తీసుకొచ్చిన అభిశంసనలు ఫెయిలయ్యాయి. ఇప్పుడు కూడా అలాగే మరోసారి విఫలం అవుతాయని భావిస్తున్నారు.
పార్లమెంటులో 130 మంది సభ్యులుండగా.. అధికారంలోకి వచ్చేందుకు పెడ్రోకు 65 సీట్లు అవసరం. కాగా, పార్లమెంట్లోని ప్రధాన పార్టీలు ఏకమవగా.. చిన్ని పార్టీలు కొన్ని పెడ్రోకు మద్దతుగా నిలిచాయి. అయినప్పటికీ పెడ్రో రాజకీయ ఎత్తుగడ ఫలించలేదు. పార్లమెంట్లో ఆయనకు వ్యతిరేకంగా 101 ఓట్లు వచ్చాయి. దాంతో ఆయన కుర్చీని వదులుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆయన మద్దతుదారులు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం పెరూ అధ్యక్షుడిగా దిన బులెర్టో బాధ్యతలు చేపట్టింది.