మలబో: మధ్య ఆఫ్రికా దేశమైన ఈక్వటోరియల్ గునియాలో ఒక నౌకకు చెందిన 16 మంది భారత్ సిబ్బందిని రెండు నెలలకుపైగా నిర్బంధించారు. దీంతో తమను విడిపించాలని వారు వేడుకుంటున్నారు. ఈ ఏడాది ఆగస్ట్ 12న అంతర్జాతీయ సముద్ర జలల్లో ఉన్న నార్వే కార్గో షిప్ ఎంటీ హీరోయిక్ ఇడున్ను ఈక్వటోరియల్ గునియా నేవీ షిప్ అడ్డుకుంది. ఆ ఓడను బలవంతంగా లూబా పోర్ట్కు తరలించారు. అనంతరం ఆగస్ట్ 14న ఆ కార్గో షిప్లోని 26 మంది సిబ్బందిని నిర్బంధించారు. వీరిలో 16 మంది భారతీయులు కాగా, 8 మంది శ్రీలంకన్లు, ఒకరు పోలాండ్, మరొకరు ఫిలప్పీన్ జాతీయుడు.
కాగా, ఆగస్ట్ 8న ఎంటీ హీరోయిక్ ఇడున్ ఓడ, నైజీరియాలోని ఏకేపీవో టెర్మినల్ వద్ద క్రూడ్ ఆయిల్ లోడ్ చేయాల్సి ఉంది. అయితే ఆలస్యం వల్ల నౌక ఆ పోర్టును దాటి పోయింది. ఈ నేపథ్యంలో అదే రోజు రాత్రి నైజీరియా నేవీకి చెందినదిగా పేర్కొన్న ఒక క్రాఫ్ట్ ఆ షిప్ వద్దకు వచ్చింది. తమను అనుసరించాలని నౌక సిబ్బందిని ఆదేశించారు. అయితే సముద్ర దొంగలుగా భావించిన సిబ్బంది, నౌకను వేగంగా నడిపి ఆ ప్రాంతం నుంచి బయటపడ్డారు. దీంతో నైజీరియా నేవీ విన్నపం మేరకు ఈక్వటోరియల్ గునియా నేవీ ఆ నౌకను అడ్డుకుని తమ దేశంలోని పోర్టుకు తరలించింది. అందులోని సిబ్బందిని నిర్బంధించింది.
మరోవైపు ఆ ఓడలోని 16 మంది భారతీయ సిబ్బంది ఈక్వటోరియల్ గునియాలో నిర్బంధంలో ఉన్న సంగతి తమకు తెలిసిందని విదేశాంగ సహాయ మంత్రి మురళీధరన్ తెలిపారు. 9 మంది భారతీయులతో సహా 15 మంది సిబ్బందిని మలబో తీరంలో నిర్బంధించినట్లు చెప్పారు. మరో ఆరుగురు భారతీయులతో సహా మిగతా 11 మందిని ఆ నౌకలోనే ఉంచారని అన్నారు. భారతీయ సిబ్బందిని విడిపించి దేశానికి తిరిగి రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు.