టోక్యో: జపాన్లో ఇప్పటికే కరోనా మహమ్మారి విజృంభిస్తుండగా.. ఇప్పుడు దానికి మంచు తుఫాన్ తోడైంది. రోజూ వేల సంఖ్యలో కొత్త కొవిడ్ కేసులు నమోదవుతుండటంతో ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోతున్నాయి. అధికారం యంత్రాంగం కరోనా కట్టడి కోసం బిజీబిజీగా పనిచేస్తున్నది. ఇంతలోనే అక్కడ మంచు తుఫాన్ దాపురించింది.
ఈ నెల 17 నుంచి జపాన్లోని వివిధ ప్రాంతాల్లో భారీగా మంచు తుఫాన్ కురుస్తున్నది. దాంతో చలి తీవ్రంగా పెరిగిపోయి జనం గడగడ వణికిపోతున్నారు. తీవ్రమైన మంచు తుఫాన్ ధాటికి జనం ఇళ్ల నుంచి కాలు బయట పెట్టలేకపోతున్నారు. హీటర్లు వేసుకుని ఇండ్లలోనే ఉంటున్నారు. చలికి తట్టుకోలేక తాజాగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. వివిధ ప్రాంతాల్లో మరో 87 మంది గాయపడ్డారు.