అకాబా : జోర్డాన్లోని దక్షిణ ఓడరేవు నగరమైన అకాబాలో క్లోరిన్ గ్యాస్ లీకేజీ అయ్యింది. ఈ ఘటనలో 13 మంది మరణించారు. మరో 251 మంది గాయపడ్డారని ప్రభుత్వ ప్రతినిధి ఫైసల్ అల్ షాబౌల్ తెలిపారు. జిబౌటికి ఎగుమతి చేస్తున్న 25 టన్నుల క్లోరిన్ గ్యాస్తో నిండిన ట్యాంక్ను రవాణా చేస్తున్న సమయంలో కిందపడిపోవడంతో గ్యాస్ లీకైనట్లు అధికారులు తెలిపారు. గ్యాస్ లీకేజీలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని, ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని మూసివేసినట్లు పేర్కొన్నారు.
గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు నిపుణులను సంఘటనా స్థలానికి పంపినట్లు డైరెకర్టే తెలిపింది. 199 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అల్-మమ్లాకా టీవీ తెలిపింది. స్థానిక ఆరోగ్య అధికారి డాక్టర్ జమాల్ ఒబీదత్ స్థానికులు ఇండ్లలోనే ఉండాలని.. ఇండ్ల కిటకీలు, తలుపులు మూసివేయాలని సూచించారు. సంఘటనా స్థలం నివాస ప్రాంతాలకు దగ్గరలోనే ఉన్నది. అంతర్గత మంత్రి అధ్యక్షతన ఈ ఘటనపై అల్-ఖాసావ్నే దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచార మంత్రి పేర్కొన్నారు.