మాడ్రిడ్, నవంబర్ 5: జన్యువే ఆమె ప్రాణాలకు రక్షణగా నిలిచింది. జన్యు పరివర్తనం (మ్యుటేషన్) ఐదు రకాల క్యాన్సర్ల నుంచి ఆమెను కాపాడింది. 800 కోట్ల మందిలో ఒకరికి మాత్రమే ఇలాంటి అసాధారణ రోగనిరోధక వ్యవస్థ ఉంటుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. తమ జీవితకాలంలోనే చూసిన అరుదైన కేసు ఇది అని, జన్యుపరమైన అద్భుతాన్ని కలిగి ఏకైక మహిళ ఈమేనని చెప్తున్నారు. స్పెయిన్కు చెందిన 36 ఏండ్ల మహిళకు శిశువుగా ఉన్నప్పుడే శరీరంలో కణితులు కనిపించాయి.
అప్పటినుంచి ప్రతి రెండేండ్లకోసారి శరీరంలో వివిధ చోట్ల కణితులు ఏర్పడుతూనే ఉన్నాయి. వైద్యులు ఆమె శరీరంలో మొత్తం 12 ట్యూమర్లు ఉన్నట్టు గుర్తించారు. ఇందులో ఐదు కణితులు మెదడు, గర్భాశయ, పెద్ద పేగు క్యాన్సర్ను అభివృద్ధి చేస్తున్నాయని కనుగొన్నారు. ఆమెపై అధ్యయనం చేపట్టి.. మొత్తం జన్యువులను విశ్లేషించారు. ఆశ్చర్యకరరంగా ఆమె శరీరంలోని ఓ జన్యువు ఉత్పరివర్తనంతో క్యాన్సర్ల పనిపడుతున్నదని గుర్తించారు. కణవిభజన, విస్తరణ ప్రక్రియకు అవసరమైన ‘ఎంఏడీ1ఎల్1’ అనే జన్యువు రెండు మ్యుటేషన్లను కలిగి ఉన్నదని తేల్చారు.
ఇది ఆమె శరీరంలో రెండంచుల కత్తిలా పనిచేస్తున్నదని గుర్తించారు. క్యాన్సర్తో పోరాడే రోగనిరోధక వ్యవస్థగా ఆ జన్యువు పనిచేస్తున్నదని శాస్త్రవేత్తలు తెలిపారు. క్యాన్సర్ కణాల స్థిరమైన ఉత్పత్తి.. ఈ కణాలకు వ్యతిరేకంగా రోగిలో దీర్ఘకాలిక రక్షణాత్మక ప్రతిస్పందను ఉత్పత్తి చేస్తున్నదని, ఇదే కణితుల అదృశ్యానికి కారణమవుతున్నదని పరిశోధకులు అంచనా వేశారు. సాధారణంగా ఇలాంటి జన్యువు ఉత్పరివర్తనం పిండ దశలోనే శిశువు మృతికి కారణమవుతుందని, కానీ ఈ మహిళలో అలా జరగలేదని వివరించారు.
అసలు పిండ దశలో ఈ మహిళ ఎలా బతికి బట్టకట్టిందో తమకే అంతుచిక్కడం లేదని స్పానిష్ నేషనల్ క్యాన్సర్ రిసెర్చ్ సెంటర్ క్యాన్సర్ గ్రూప్ హెడ్ డాక్టర్ మార్కస్ మలుంబ్రెస్ పేర్కొన్నారు. జన్యువు రెండు కాపీల్లో (తల్లి, తండ్రి నుంచి వచ్చేవి) ఉత్పరివర్తనాలు ఉన్నప్పుడు పిండం చనిపోతుందని, కానీ ఈ మహిళ విషయంలో అలా జరగలేదని వెల్లడించారు. అలాగే, జన్యువు మ్యుటేషన్ వల్ల ఐదు రకాల క్యాన్సర్లు అభివృద్ధి చెంది, వాటంతట అవే అదృశ్యమైపోయానని చెప్పారు. ఈ అధ్యయనం వివరాలు సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్లో ప్రచురితమయ్యాయి.