మానాగ్వా: లాటిన్ అమెరికా దేశమైన నికరాగ్వేలో ప్రతిపక్ష నేతల అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉన్నది. ఆదివారం మరో అయిదు మంది ప్రతిపక్ష నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అరెస్టు అయిన ప్రతిపక్ష నేతల సంఖ్య 12కు చేరింది. అరెస్టు అయిన వారిలో దేశాధ్యక్షుడు డానియల్ ఒర్టేగాతో కలిసి గతంలో చాన్నాళ్లు పనిచేసిన వారు ఉన్నారు. నికరాగ్వే వ్యవహారాల్లో విదేశీ జోక్యం పెరిగేలా ప్రతిపక్ష నేతలు ప్రేరేపిస్తున్నట్లు వారి ఆరోపణలు ఉన్నాయి. దేశంలో అల్లర్లు, నేరాలు జరిగే రీతిలో వాళ్లు ప్రవర్తిస్తున్నట్లు కూడా ఆరోపిస్తున్నారు. నిజానికి ఈ ఏడాది నవంబర్లో దేశాధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఆ ఎన్నికల్లో పోటీ చేయనున్న ప్రతిపక్ష నేతలందర్నీ అరెస్టు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అధ్యక్షుడు ఒర్టేగాకు 75 ఏళ్లు. నాలుగవ సారి దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని ఆయన ఆశిస్తున్నారు. కానీ ఒపీనియన్ పోల్స్లో ఆయన పట్ల వ్యతిరేకత వ్యక్తమైంది. 2018లో నిరసనకారులపై ప్రభుత్వం దమనకాండను కొనసాగించింది. ఆ ఆందోళనల్లో వందలాది మంది మరణించారు. దీంతో అధ్యక్షుడు ఒర్టేగాపై ప్రజల్లో విముఖత పెరిగింది. 2007 నుంచి ఒర్టేగా అధికారంలో ఉన్నారు. అయితే ప్రజల్లో, పార్టీలో వచ్చే వ్యతిరేకతను ఆయన అణిచివేస్తున్నారు. ఒర్టేగాను విడిచి వెళ్లినవారు.. ప్రతిపక్ష పార్టీ ఉన్నామోస్లో చేరుతున్నారు. దీంతో సాండినిస్టా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్కు చెందిన అధ్యక్షుడు ఒర్టేగా.. ప్రతిపక్ష నేతలపై పగతీర్చుకుంటున్నారు. అరెస్టు అయిన వారిలో మాజీ ఆరోగ్యశాఖ మంత్రి డోరా టెల్లేజ్, రిటైర్డ్ జనరల్ హ్యూగో టోరేస్ల ఉన్నారు.
నికరాగ్వే సార్వభౌమాధికారం, స్వాతంత్ర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రతిపక్ష నేతలు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. విదేశీ శక్తుల నుంచి ఆర్థిక సాయంతో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో వారిని దేశద్రోహం చట్టం కింద అరెస్టు చేస్తున్నారు. ఒకవేళ వాళ్లు ఆ చట్టం కింద నేరస్థులుగా తేలితే వారికి ఇక ఎన్నికల్లో పోటీ చేసే అధికారం ఉండదు. అక్కడ దేశద్రోహులకు 15 ఏళ్ల జైలుశిక్ష విధిస్తారు.