దక్షిణ భారత దేశంలో ఇదే మొదటిది..
పూర్తి కావొచ్చిన నిర్మాణ పనులు
ఈ నెలాఖరుకు ఉత్పత్తి ప్రారంభించే అవకాశం
ప్రతి నెలా రూ.30 లక్షలు ఆదా : ప్రొఫెసర్ రాజారావు
శ్వాస తీసుకోవడం కష్టమై.. అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ కోసం ఎదురుచూసే బాధితులకు శుభవార్త.. ఇక సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానలో రోగులకు సరిపడే ఆక్సిజన్ ఉత్పత్తి కాబోతోంది. దవాఖాన ఆవరణలోనే ఒక్కో నిమిషానికి వెయ్యి లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ను ఉత్పత్తి చేసే రెండు ఆక్సిజన్ ప్రెషన్ స్వింగ్ ఎడ్సార్ప్సన్ సెంటర్ల ఏర్పాటునకు పనులు ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేక భవనాన్ని నిర్మిస్తున్నారు. అది పూర్తి కాగానే.. లిక్విడ్ ఆక్సిజన్ తయారు చేసే యంత్ర పరికరాలను ప్రత్యేక వాహనాల్లో తీసుకువచ్చి అమర్చనున్నారు. ఇప్పటికే సివిల్ వర్క్స్ పూర్తి అయ్యాయని.. మరో వారం రోజుల్లో యంత్రాలను అమర్చగానే రూఫ్ ఏర్పాటు చేస్తామని టీఎస్ఎంఐడీసీ ఈఈ సారంగపాణి తెలిపారు. ఏప్రిల్ చివరి నాటికి ఆక్సిజన్ ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉన్నదని దవాఖాన పరిపాలనా అధికారులు తెలిపారు.
నీటి ఆవిరి, ఆక్సిజన్, నైట్రోజన్, వివిధ రకాల నోబల్ గ్యాస్లను తగు మోతాదులో కలిపి ప్రత్యేకమైన యంత్ర పరికరాలను వినియోగించి వివిధ దఫాల్లో అవసరమైన ఉష్ణోగ్రతల వద్ద వేడి చేస్తారు. తద్వారా ద్రవ రూపంలో ఉన్న ఆక్సిజన్ తయారవుతుంది. దానిని అందుబాటులో ఉన్న ట్యాంకులకు అనుసంధానం చేసి.. ప్రత్యేక పైప్లైన్ ద్వారా ఐసీయూలలోని వెంటిలేటర్లకు, ఆక్సిజన్ బెడ్లకు సరఫరా చేస్తారు. రోగుల అవసరాలకు మించి ఉత్పత్తి అయిన ఆక్సిజన్ను సిలిండర్లలో నింపి ఇతర దవాఖానలకు, అంబులెన్స్లకు సరఫరా చేయనున్నారు. వీటిని రోగులు కూడా తమ ఇండ్లలోనూ వినియోగించుకునే వెసులుబాటు ఉంది.
గాంధీ దవాఖానలో ఈ లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి యూనిట్లు ప్రారంభం అయితే…ప్రతి నెలా రూ.30 లక్షలు ఆదా అవుతాయి. అందుకే టీఎస్ఎంఐడీసీ ద్వారా యుద్ధప్రాతిపదికన యూనిట్ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఏప్రిల్ నెలాఖరులోగా దానిని ప్రారంభించాలని అనుకుంటున్నాం. దక్షిణ భారతదేశంలో ఒక సర్కారు దవాఖానలో ఇదే మొదటిదిగా నిలవనున్నది. ఈ ప్లాంట్ నిర్మాణానికి గాంధీ దవాఖానను ఎంపిక చేయడం ఎంతో ఆనందంగా ఉన్నది. దీంతో పేద రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వెసులుబాటు కలుగనుంది. – ప్రొఫెసర్ రాజారావు, దవాఖాన సూపరింటెండెంట్