కీవ్: ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం తెల్లవారుజామున రేవుపట్టణమైన ఒడెస్సాలో బాంబుల వర్షం కురిపించింది. ఒడెస్సాలోని ఓడరేవులో ఉన్న బహుళ అంతస్థుల అపార్ట్మెంట్పై రష్యన్ బలగాలు క్షిపణితో దాడి చేశాయి.. దీంతో పది మంది మరణించినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారని వెల్లడించారు. అయితే మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేదన్నారు.
ఉక్రెయిన్పై ఫిబ్రవరి చివరి వారంలో రష్యా సైనిక చర్య ప్రారంభించింది. అప్పటి నుంచి ఉక్రెయిన్ పట్టణాలపై బాంబులతో దాడులు చేస్తున్నది. కాగా, వ్యూహాత్మకంగా కీలకమైన స్నేక్ ఐల్యాండ్ నుంచి తమ దళాలను ఉపసంహరించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఉక్రెయిన్, రష్యా యుద్ధం ఆరంభంలో ఈ ద్వీపం కీలకంగా నిలిచింది. ఉక్రెయన్ దళాలు కూడా ఈ విషయాన్ని ద్రువీకరించాయి. రష్యా దళాలు ఆ ఐల్యాండ్ నుంచి వెనక్కి వెళ్లినట్లు ఉక్రెయిన్ చెప్పింది.
నల్ల సముద్రంలో ఉన్న స్నేక్ ఐల్యాండ్ .. రష్యా, ఉక్రెయిన్ వార్లో కీలకంగా మారింది. గతంలో రష్యా ఆధీనంలో ఉన్న ఈ ప్రాంతాన్ని ఇప్పుడు ఉక్రెయిన్ స్వాధీనం చేసుకున్నది. ఈ దీవిని ఆక్రమించినవారు ఒకవేళ అక్కడ లాంగ్ రేంజ్ మిస్సైల్ వ్యవస్థను ఏర్పాట్లు చేస్తే అప్పుడు వాళ్లకు ఈ ప్రాంతంపై పూర్తి పట్టు సాధించినట్లు అవుతుంది. అయితే రష్యాకు ఆ అవకాశం ఉన్నా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసింది.
గతంలో రొమేనియా ఆధీనంలో ఉన్న స్నేక్ ఐలాండ్ను సోవియేట్ యూనియన్ సమయంలో రేడార్ బేస్గా వాడారు. స్నేక్ ఐల్యాండ్ నుంచి దళాలను ఉపసంహరించడం అంటే తాము ఆహార ఎగుమతుల్ని అడ్డుకోవడంలేదని స్పష్టం చేసినట్లు అవుతుందని రష్యా చెప్పింది. ఇదొకరకంగా ఉక్రెయిన్ నుంచి వ్యవసాయ ఉత్పత్తుల్ని తరలించేందుకు ఐక్యరాజ్యసమితి చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుతగలడం లేదని రష్యా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆహార సంక్షోభానికి తామే కారణమని చెప్పడానికి ఇప్పుడు ఉక్రెయిన్ వద్ద సమాధానం ఉండదని రష్యా తెలిపింది. ఉక్రెయిన్ మాత్రం ఇంకా నల్ల సముద్రంలోని తీర ప్రాంతాన్ని క్లియర్ చేయడం లేదని రష్యా ఆరోపిస్తోంది.