కాలిఫోర్నియా, డిసెంబర్ 13: కర్బన కాలుష్యం లేని అంతులేని విద్యుత్తు ఉత్పాదన కోసం శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా చేస్తున్న కృషి ఫలించింది! పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న శిలాజ ఇంధనాలకు ముగింపు పలికే దిశగా ముందడుగు పడింది. కేంద్రక సంలీనం (నూక్లియర్ ఫ్యుజన్) జరిపేందుకు ఉపయోగించిన లేజర్ ఎనర్జీ కంటే.. కేంద్రక సంలీన చర్య ద్వారా అధిక శక్తిని ఉత్పత్తి చేయడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. కాలిఫోర్నియాలోని లారెన్స్లివర్మోర్ ల్యాబొరేటరీ గత నెలలో ఈ ప్రయోగం నిర్వహించింది. తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. శాస్త్రసాంకేతిక రంగంలో ఇదో మైలురాయి అని అమెరికా ఎనర్జీ విభాగం అభివర్ణించింది. శుద్ధ ఇంధన ఉత్పత్తిలో విప్లవాత్మక మార్పులకు ఇది నాంది కాబోతున్నదని పేర్కొన్నది.
మానవాళి పరిష్కరించిన అతిపెద్ద సవాల్
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న అణువిద్యుత్తు కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తికి కేంద్రక విచ్ఛిత్తి (న్యూక్లియర్ ఫిజన్) ప్రక్రియను వాడుతున్నారు. అదే కేంద్రక సంలీనం ప్రక్రియలో హైడ్రోజన్ లాంటి తేలికైన రెండు కేంద్రకాలు అధిక ఉష్ణోగ్రత వద్ద కలిసిపోయి హీలియం కేంద్రకంగా మారుతూ అధిక శక్తిని విడుదల చేస్తాయి. సూర్యుడితో సహా నక్షత్రాల్లో ఈ ప్రక్రియ జరుగుతుంది. భూమిపై, ప్రత్యేకమైన పరికరాల్లో అధిక ఉష్ణోగ్రతల వద్ద హైడ్రోజన్ను మండిచడం ద్వారా ఈ ప్రక్రియను చేపడుతారు. 192 శక్తివంతమైన లేజర్లను ఉపయోగించి లారెన్స్ నేషనల్ ల్యాబొరేటరీ ఈ ప్రక్రియను చేపట్టింది. కేంద్రక విచ్ఛిత్తి కంటే కేంద్రక సంలీనంతో అధిక ప్రయోజనాలున్నాయి. దీనితో అణు విపత్తు ప్రమాదం ఉండదు. అయితే పారిశ్రామిక స్థాయిలో ఈ విధానాన్ని అందుబాటులోకి తేవడానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉన్నదని పరిశోధకులు చెప్తున్నారు. తాజా ఘనత మానవాళి పరిష్కరించిన అతిపెద్ద శాస్త్రీయ సవాల్ అని ఎల్ఎల్ఎన్ఎల్ డైరెక్టర్ కిమ్ బుడిల్ ప్రకటించారు.