న్యూఢిల్లీ, అక్టోబర్ 6: పాత వాహనాన్ని ‘తుక్కు విధానం’లో ఇచ్చేసి కొత్త వాహనం కొనేవారికి రోడ్డు పన్నులో 25 శాతం వరకు రాయితీ లభిస్తుందని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ తెలిపింది. ఈ మేరకు బుధవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. వ్యక్తిగత వాహనాలకైతే 25 శాతం వరకు, వాణిజ్య వాహనాలకైతే 15 శాతం వరకు రోడ్డు పన్నులో రాయితీని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇస్తాయని పేర్కొంది. ఈ రాయితీ వ్యక్తిగత వాహనాలకు 15 ఏండ్ల వరకు, వాణిజ్య వాహనాలకు 8 ఏండ్ల వరకు ఉంటుందని తెలిపింది. ఉమ్మడి జాబితాలో పన్ను నిబంధనలను నిర్ణయించే అధికారం తమకు ఉందని కేంద్రం చెబుతూ వస్తున్నది. సెంట్రల్ మోటార్ వెహికిల్స్ (24వ సవరణ) రూల్స్గా పిలిచే ఈ కొత్త రూల్స్ వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయని నోటిఫికేషన్లో పేర్కొంది.