వాషింగ్టన్: మాస్క్ ధరించేందుకు నిరాకరించిన మహిళను పోలీసులు కిందకునెట్టి చేతులకు బేడీలు వేశారు. అమెరికాలోని గాల్వెస్టన్లో ఈ ఘటన జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల నమోదులో అమెరికా తొలి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు జీవన స్రవంతి సాధారణ స్థితికి వచ్చేందుకు ఆ దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలను సడలిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాస్క్ ధరించడం తప్పనిసరి కాదని టెక్సాస్ గవర్నర్ బుధవారం పేర్కొన్నారు. అయితే కరోనా నిబంధనల అంశాన్ని వ్యాపార సంస్థలకే వదిలేశారు.
ఈ నేపథ్యంలో గాల్వెస్టన్కు చెందిన టెర్రీ రైట్ అనే 65 ఏండ్ల మహిళ గురువారం బ్యాంక్ ఆఫ్ అమెరికా శాఖకు వచ్చారు. ఆ బ్యాంకు మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేసింది. టెర్రీ రైట్ మాస్క్ ధరించకపోవడాన్ని గమనించిన బ్యాంకు సిబ్బంది ఆమెకు ఈ విషయం చెప్పారు. ఒక మాస్క్ కూడా ఇచ్చి ధరించాలని కోరారు. అయితే ఆ మహిళ మాస్క్ ధరించేందుకు నిరాకరించారు. దీంతో బ్యాంకు సిబ్బంది పోలీసులను పిలిపించారు.
అక్కడకు వచ్చిన ఒక పోలీస్ సిబ్బంది ఆమెను మాస్క్ ధరించాలని లేదా బయటకు వెళ్లిపోవాలని చెప్పారు. అయితే తాను డబ్బులు తీసుకునేందుకు వచ్చానని, మాస్క్ నిబంధన గవర్నర్ ఎత్తివేశారంటూ వాదించసాగింది. ఆమె ఎంతకు మాట వినకపోవడంతో పోలీస్ ఆమెను కిందకు తోసి చేతులు వెనక్కి నెట్టి బేడీలు వేశారు. పోలీసులు తనపట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారని అక్కడున్న వారి ఉద్దేశించి ఆమె మహిళ అరిచింది. అయితే ఆమె వాదనను వారు తప్పుపట్టారు.
మరోవైపు పెనుగులాటలో ఆ మహిళ కాలికి గాయమైంది. ఈ విషయం చెప్పడంతో పోలీసులు ఆమెను తమ వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా ఇదంతా పోలీస్ ధరించిన బాడీ కెమెరాలో రికార్డు అయ్యింది. పోలీసుల తీరును మీడియా వద్ద రైట్ తప్పుపట్టగా, బ్యాంకు నిబంధనలు ఉల్లంఘించిన ఆమెకు అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని పోలీస్ అధికారి తెలిపారు.