అల్లాపూర్, ఆగస్టు 17: అల్లాపూర్ డివిజన్ పరిధిలోని రామారావునగర్, స్నేహపురికాలనీ, కబీర్నగర్ తదితర లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు సమస్య పరిష్కారానికి చేపట్టిన నాలా విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి. వానకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడైతే నాలా కుంచించుకుపోయిందో అక్కడే పనులు వేగంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. పనులు పూర్తయితే ఈ ప్రాంత ప్రజలకు ముంపు సమస్య తప్పనుంది.
అల్లాపూర్ ప్రాంత రామారావునగర్ నుంచి, స్నేహపురి కాలనీ, కబీర్ నగర్, బబ్బుగూడ వరకు ప్రవహించే నాలాను వెడల్పు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నాలా కుచించుకుపోవడంతో వర్షం వచ్చిన సమయంలో నాలాను ఆనుకొని ఉన్న బస్తీలు, కాలనీల రోడ్లపైకి వరద నీరు చేరి వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఇండ్లలోకి వరద నీరు చేరి ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. దశాబ్దాలుగా వానకాలం వచ్చిందంటే చాలు ప్రజలు తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. ఎన్నికల హామీని నెరవేర్చాలనే సంకల్పంతో సమస్య శాశ్వత పరిష్కారానికి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విషయాన్ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన మంత్రి నాలా విస్తరణకు కావాల్సిన నిధులు మంజూరు చేశారు. కేటీఆర్ చేతుల మీదుగా పనులు ప్రారంభించారు. ఇప్పుడు విస్తరణ పనులు శరవేగంగా జరుతున్నాయి.
వానకాలం కావడంతో నాలా విస్తరణ పనులకు ఆటంకం ఏర్పడకుండా పనులను వేగంగా పూర్తిచేసేందుకు కాంట్రాక్టర్ను ఆదేశించాం. ఎక్కడైతే నాలా కుచించుకు పోయిందో మొట్టమొదటిగా అక్కడే విస్తరణ పనుల జరిగేలా చర్యలు తీసుకున్నాం. దీంతో వర్షం కురిసిన సమయంలో వరదనీరు రోడ్ల పైకి రాకుండా సాఫీగా వెళ్లేందుకు వీలుగాఉంటుంది. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయిస్తాం.- వి.మమత, కూకట్పల్లి జోనల్ కమిషనర్
అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట ఇచ్చాడంటే పనులు పూర్తిచేసి తీరుతాడు. నాలా కుంచికుపోవడంతో వానకాలంలో ముంపు సమస్యతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు కళ్లారా చూసిన ఆయన ఎలాగైనా శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగారు. మంత్రి కేటీఆర్ సహకారంతో నాలా విస్తరణ పనులు ప్రారంభించి, పూర్తిచేసేందుకు లక్ష్యసాధన దిశగా అడుగులు వేస్తున్నాం.- సబీహాబేగం, అల్లాపూర్ కార్పొరేటర్
వానకాలం వచ్చిందంటే నాలా పరీవాహక ప్రాంతాల్లో నివసించే జనం భయంతో కాలం గడపాల్సిన పరిస్థితి. చిన్న వర్షానికే నాలాలో వరద ఉధృతి పెరిగి ప్రమాదవశాత్తు నాలాలో పడి చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలనే సంకల్పంతో ప్రణాళికాబద్ధంగా నాలా విస్తరణ పనులు చేపట్టారు. పనులు పూర్తయితే ఇక్కడి ప్రజలకు ముంపు సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.- సత్యం, రామారావునగర్ బస్తీ అధ్యక్షుడు