కేపీహెచ్బీ కాలనీ, అక్టోబర్ 5 : వర్షంనీటి ముంపు సమస్యలు తలెత్తకుండా చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. మంగళవారం కూకట్పల్లి జోన్ ఆఫీస్లో ఐదు సర్కిళ్ల డీసీలతో జడ్సీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరదనీటి కాలువలను పరిశీలించి బాటిల్నెక్ ప్రాంతాలలో నీటి ప్రవాహానికి అడ్డంకులను తొలగించాలన్నారు. కాలువలలో మనుషులు పడకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. నీటి ప్రవాహానికి అడ్డుపడే చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడూ తొలగించాలన్నారు.
కాలువలలో వ్యర్థాలను తొలగించడంతో పాటు అక్కడినుంచి నిర్మానుష ప్రదేశాలకు తరలించాలన్నారు. అలాగే ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించాలని స్వచ్ఛ ఆటోలు ప్రతి ప్రాంతానికి వెళ్లేలా చూడాలన్నారు. ఎప్పటికప్పుడూ చెత్తను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. మరోవైపు వందశాతం హరిత లక్ష్యాన్ని చేరుకునే దిశగా కాలనీలు, బస్తీలలో భారీగా మొక్కలు నాటాలన్నారు. వందశాతం హరితహారం కాలనీలుగా మార్చాలన్నారు. ఇప్పటికే చేపట్టిన డ్రైనేజీ, రోడ్లు, ఇతర పనులను త్వరితగతిన పూర్తి చేయడంపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో ఉప కమిషనర్లు రవికుమార్, రవీందర్కుమార్, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.