కుత్బుల్లాపూర్, సెప్టెంబర్30: ఓ వైన్ షాపు యజమాని బాధ్యతారాహిత్యంతో ఓ వ్యక్తి నాలాలో పడి గల్లంతయ్యాడు. కుత్బుల్లాపూర్లోని న్యూ రాయల్ వైన్స్ షాప్ నిర్వాహకుడు చెత్తాచెదారాన్ని, ఇతర వస్తువులను నేరుగా జీహెచ్ఎంసీ పారిశుధ్య వాహనానికి ఇవ్వకుండా పక్కనే ఉన్న నాలాలో వేసేందుకు దాని రక్షణ కవచాన్ని తొలగించాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి మోహన్రెడ్డి అనే వ్యక్తి ప్రమాదవశాత్తు కాలు జారీ ఆ నాలాలో పడిపోయాడు. గల్లంతైన మోహన్రెడ్డి కోసం డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఘటనాస్థలిని జోనల్ కమిషనర్ మమత, కుత్బుల్లాపూర్ ఉపకమిషనర్ మంగతాయారు పరిశీలించారు. నాలా జాలి తొలగించినందుకు బల్దియా అధికారులు వైన్ షాపు యజమానికి రూ. లక్ష జరిమానా విధించారు.