హిమాయత్నగర్, మార్చి13: ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తున్న ఓ యువకుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత యువతి బుధవారం నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అడ్మిన్ ఎస్సై నరేశ్ కుమార్ కథనం ప్రకారం.. నారాయణగూడలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న ఓ యువతి (24) ప్రైవేట్ ఉద్యోగి. స్థానికంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆ యువతి 2021లో డిగ్రీ పూర్తి చేసింది. సీహెచ్ హరీశ్ అనే యువకుడు కూడా అదే కళాశాలలో చదువుకున్నాడు.
చదువుకుంటున్న సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడటంతో స్నేహితులుగా ఉంటూ.. గత నాలుగేండ్లుగా ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. ఇంతకాలం బాగున్న హరీశ్.. గత మూడు నెలలుగా యువతిపై తప్పుగా మాట్లాడు తూ.. వేధింపులకు గురి చేస్తున్నాడు. ఆ యువతి జాబ్ చేసే ప్రాంతానికి వెళ్లి అసభ్యంగా తిట్టడంతో పాటు ఆమె చెంపపై కొట్టాడు. దీంతో హరీశ్ వేధింపులు భరించలేక.. అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై శిరీష కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.