సిటీబ్యూరో, అక్టోబర్ 7(నమస్తే తెలంగాణ)/రామంతాపూర్: విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి యంగ్ ప్రెన్యూర్-2023 పేరుతో ఇంటర్ స్కూల్ పోటీలు నిర్వహించినట్లు రామంతాపూర్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డి అన్నారు. పాఠశాల ప్రాంగణంలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిధిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎవరి ఆలోచన అయినా చిన్నది లేదా పెద్దది కాదన్నారు. ప్రపంచాన్ని మార్చే శక్తిని కలిగి ఉన్న ప్రామాణికత, అభిరుచితో విద్యార్థులు రూపొందించిన అసాధారణ ఆలోచనలను ఆమె అభినందించారు. న్యాయ నిర్ణేత ప్యానల్ సభ్యుడు శ్రీఫణి కొండేపూడి మాట్లాడుతూ, విద్యార్థుల విశేషమైన అభిరుచి, చైతన్యం, అంకితభావాన్ని ప్రశంసించారు.
అపజయాన్ని విజయానికి సోపానంగా స్వీకరించాలని ఆయన పేర్కొన్నారు. ఈ పోటీల్లో పెట్ ఎక్స్పెర్ట్ బృందం అగ్ర స్థానాన్ని పొందింది. చివరి రౌండ్లో 7 బృందాలు వినూత్న ఆలోచనలను ప్రదర్శించాయి. హెచ్పీఎస్ రామంతాపూర్కు చెందిన అవిన్య బృందం వ్యర్థాలను కంపోస్ట్గా మార్చడానికి బోకాషి కంపోస్ట్ పద్ధతిని ప్రతిపాదించింది. ఆంత్రప్రెన్యూర్ ప్రొగ్రామ్ చైర్మన్ జై రెడ్డి, కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు ప్రవీణ్ తైలం, అశ్విన్రావుతో పాటు నగరంలోని పలు పాఠశాలల నుంచి 10, 11, 12వ తరగతుల విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై తమ స్టార్టప్ కాన్సెప్ట్లను ప్రదర్శించారు.