మారేడ్పల్లి, ఆగస్టు 7: సికింద్రాబాద్ వైఎంసీఏ ఆవరణలో ఈ నెల 14న మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నామని స్పెక్ జాబ్ సీఈఓ డాక్టర్ అబ్రహం తెలిపారు. సంస్థ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అబ్రహం మాట్లాడుతూ, స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో భాగంగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నామన్నారు. మేళాలో 30 కంపెనీల స్టాళ్లను ఏర్పాటు చేసి ఇంటర్వ్యూలు నిర్వహించి, ఉద్యోగులను ఎంపిక చేసుకుంటారన్నారు.
టెక్నికల్, నాన్ టెక్నికల్, ఐటీ, ఫార్మా, ఇండస్ట్రీయల్ వంటి ఎన్నో రంగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నామన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఇంటర్యూలకు వచ్చే అభ్యర్థులు తమకు సంబంధించిన అర్హత ధ్రువ పత్రాలను వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఇతర వివరాల కోసం ఫోన్ నం: 88850 88854, 88854 10555లలోనే సంప్రదించాలని సూచించారు. సమావేశంలో టీం లీజ్ సంస్థ ప్రతినిధి రాజ్ కుమార్, ఎస్బీఐ ప్రతినిధి చందర్, జ్యోత్న్స, రాకేష్, భాస్కర్, శైలేష్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.