యాదాద్రి, మార్చి16: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యసన్నిధానంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండోరోజైన మంగళవారం నాడు బ్రహ్మోత్సవాలలో గరుడ పతాక ధ్వజారోహణ అత్యంత వైభవంగా జరిగింది. నిత్య కైంకర్యాలు సమర్పించిన అనంతరం శ్రీలక్ష్మీనారసింహుడి కల్యాణ మహోత్సవానికి దేవతలందరినీ ఆహ్వానిస్తూ గరుత్మంతుడిని వియుక్తం చేశారు. ఉదయం 9 గంటలకు ధ్వజారోహణకు ముందు బాలాలయంలోని యాగశాల ప్రవేశం, ద్వారాతోరణం, ధ్వజకుంభారాధన, మహాకుంభారాధన, చతుస్థానార్చన నిర్వహించారు. అనంతరం అగ్నిప్రతిష్ఠ, మూలమంత్ర, మూర్తిమంత్ర హోమాలు చేశారు.
యాదాద్రి నరసింహుడి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం నుంచి స్వామివారికి అలంకార సేవలు ప్రారంభం కానున్నాయి. ఉదయం మత్స్యవతారం, రాత్రి శేషవాహన సేవలో స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం యాగశాలలో హవన పూజలు, వేద పారాణాలు ప్రారంభిస్తారు.
బ్రహ్మోత్సవాలకు సకల దేవకోటిని ఆహ్వానిస్తూ ఆలయ ధ్వజస్తంభంపై గరుడ పతాకం ఎగురవేయడమే గరుడ పతాక ధ్వజారోహణం. బాలాలయం మండపం ఎదురుగా గరుడ ఆళ్వార్ల చిత్రపటం వద్ద పట్టువస్ర్తాలు, వజ్రవైఢూర్యాలు, ముత్యాల ఆభరణాలతో అలంకరించిన స్వామి, అమ్మవార్లను వేదికపై అధిష్టింపజేశారు. వేదమంత్రాలతో దేవతలను అర్చించారు. ప్రత్యేకంగా గరుడాధివాసం, గరుడ హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. తెల్లటి నూతన వస్త్రంపై కుంకుమతో గరుత్మంతుడి చిత్రపటం వేసి ఆ వస్ర్తానికి 27 విధములైన ఉపచారాలు చేసి మంత్రయుక్తంగా పూజించారు. వేదమంత్రాల నడుమ మంగళ వాయిద్యాలు, జయ జయ ధ్వానాలు మారుమోగుతుండగా పవిత్ర దర్భలతో తయారుచేసిన తాడుతో గరుత్మంతుడి చిత్రపట వస్ర్తాన్ని ధ్వజస్తంభానికి కట్టి ఎగురవేశారు. చతుర్వేద పారాయణతో దేవతలను ఆవాహన చేశారు. ధ్వజారోహణం అనంతరం అష్టదిగ్పాలక బలిహరణ నిర్వహించారు. పెసరపప్పుతో అన్నం కలిపిన గరుడ ముద్దలను తయారుచేసి వాటిని నివేదిస్తూ మంత్రోచ్ఛారణ చేస్తూ పైకి ఎగురవేసి గరుత్మంతుడిని ఆహ్వానించారు. మహిమాన్వితంగా భావించే ఆ గరుడ ప్రసాదాన్ని భక్తులందరికీ పంచిపెట్టారు. ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని పురాణోక్తి.
బాలాలయంలో సాయంత్రం ప్రత్యేక హోమాన్ని నిర్వహించారు. చతుస్థానార్చన ఉత్సవాలను అత్యంత వైభవంగా జరిపారు. సభాస్థానంలో 33 కోట్ల దేవతలను 33 రాగాలు, 33 తాళాలు, 33 వేదమంత్రాలతో వేడుకలకు ఆహ్వానించారు. విచ్చేసిన దేవతలందరికీ అర్చకులు దివ్యవిమాన గోపురంలో వసతి సౌకర్యాలు, నైవేద్య కైంకర్యాలను అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి ఎన్. గీత, ఆలయ ప్రధానార్చకులు నల్లంధీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు, యాజ్ఞీకులు శ్రీమాన్ ఉభయ వేదాంత శేషం ప్రణీత్ కుమారాచార్యులు, యాజ్ఞీక సిబ్బంది, ఉప ప్రధానార్చకులు వెంకటాచార్యులు, రంగాచార్యులు, సురేంద్రచార్యులు, శ్రీధరాచార్యులు, సహాయ కార్యనిర్వహణాధికారులు శ్రవణ్కుమార్, రమేశ్బాబు తదితరులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాలకు అష్ట దిక్పాలకులను ఆహ్వానించేందుకు మంగళవారం రాత్రి భేరీపూజ, దేవతాహ్వానం నిర్వహించారు. దుష్టశక్తులను దూరంగా పంపించేందుకు మంత్రపూర్వకంగా భేరితాడనం చేశారు. ఉత్సవ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగాలని వేడుకుంటూ ఈ వేడుకను నిర్వహించారు. శబ్ధ బ్రహ్మం, మూలమంత్ర జపంతో ప్రధాన వాయిద్య భేరిని మోగించి కంకణధారణ చేయడం ఈ ఉత్సవ ప్రత్యేకత.