చర్లపల్లి, సెప్టెంబర్ 11: మానసిక పరిపక్వత లేని వారు చిన్న కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, జైలులో ఆత్మహత్యలకు పాల్పడకుండా అవగాహన కల్పిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ రాజీవ్త్రివేది పేర్కొన్నారు. చర్లపల్లి కేంద్ర కారగారంలో ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ఆత్మహత్యల నివారణపై ఖైదీలకు ఉన్నతి కార్యక్రమంలో భాగంగా ప్రొఫెసర్ డాక్టర్ సీ.బీనాతో కలిసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జైలులో ఖైదీలు ఆత్మహత్యలకు పాల్పడకుండా అవగాహన కల్పించడంతో పాటు ఆత్మహత్యలను నివారించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు.
ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదని, నిత్య జీవితంలో సమస్యలు వస్తుంటాయని, వాటికి అధైర్యపడి ఆత్మహత్యలకు పాల్పడవద్దన్నారు. ఆత్మహత్యలకు పాల్పడేవారిని సిబ్బంది గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో కేంద్ర కారాగారం, వ్యవసాయ క్షేత్రం సూపరింటెండెంట్లు సంపత్, శివ కుమార్ గౌడ్, డిప్యూటీ సూపరింటెండెంట్లు కృష్ణమూర్తి, కాళీదాస్, శశికాంత్, దశరథం, జైలర్లు రామకృష్ణ, ధనుంజయ, పరశురాములు, జ్యోతిశ్వర్ రెడ్డి, మొగిలేశ్లతో పాటు డిప్యూటీ జైలర్లు, సిబ్బంది, ఖైదీలు పాల్గొన్నారు.