ప్రపంచ హృద్రోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మాదాపూర్లోని దుర్గంచెరువులో కార్డియాలజిస్ట్ సొసైటీ తెలంగాణ స్టేట్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వరల్డ్ హార్ట్ డే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తదితరులు
కొండాపూర్, సెప్టెంబర్ 29 : గుండె సంబంధిత వ్యాధుల నుంచి ప్రాణాలను కాపాడేందుకు సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా సీపీఆర్పై అవగాహన కల్పించడంతోపాటు శిక్షణ ఇప్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని వైద్య ఆరోగ్య, ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం మాదాపూర్లోని దుర్గంచెరువు వద్ద కార్డియాలజిస్ట్ సొసైటీ తెలంగాణ స్టేట్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వరల్డ్ హార్ట్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం, చెడు అలవాట్లు, ఒత్తిళ్లు వంటి అనేక కారణాలతో గుండె సమస్యలకు దారితీస్తున్నాయన్నారు. రోజూ వ్యాయామం చేస్తే గుండెను కాపాడుకోవచ్చని చెప్పారు. దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఓ సర్వే ప్రకారం.. 24శాతం మంది షుగర్, 14శాతం మంది బీపీ సమస్యలతో బాధపడుతున్నట్లు తేలిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బీపీ, షుగర్ వంటి సమస్యలకు ఉచితంగా మందులు అందజేస్తుందన్నారు.
ప్రాథమిక దశలో వీటిని గుర్తించకపోవడం వల్లే గుండె, కిడ్నీ, కాలేయ వ్యాధులకు దారితీస్తున్నట్లు తెలిపారు. వయస్సుతో సంబంధం లేకుండా కార్డియాక్ అరెస్ట్ బారిన పడుతున్నారని, సకాలంలో స్పందించి సీపీఆర్ చేస్తే ప్రాణాపాయస్థితి నుంచి కాపాడవచ్చన్నారు. సీఎం కేసీఆర్ సీపీఆర్పై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కల్పించడంతోపాటు శిక్షణ అందించేలా ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు. పారామెడికల్, వైద్య సిబ్బంది, పోలీసు కమ్యూనిటీ వలంటీర్లు, ఉద్యోగులు, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్ వర్కర్స్కు శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. దుర్గంచెరువులో ఏర్పాటు చేసిన బీపీ యంత్రాలను ప్రారంభించి, వాకర్స్తో కలిసి హృద్రోగ సమస్యలపై అవగాహన వాక్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్డియాలజిస్ట్ సొసైటీ తెలంగాణ స్టేట్ చాప్టర్ ప్రతినిధులు, వాకర్స్ పాల్గొన్నారు.