సిటీబ్యూరో, జనవరి 10 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో మౌలిక వసతుల కల్పనకు ప్రభు త్వం పెద్దపీట వేస్తున్నది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నారు. అయితే ఎస్ఎన్డీపీ, ఎస్ఆర్డీపీ, లింకు రోడ్లు, సీఆర్ఎంపీ రోడ్లకు దీటుగా సాధారణ పనులు సైతం మిషన్ మోడ్లో నడుస్తున్నాయి. ఇందులో భాగంగానే 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు సీఆర్ఎంపీ మినహా 1665 చోట్ల రహదారులను అభివృద్ధి చేశారు.
ఇందుకు రూ. 457.16 కోట్లు ఖర్చు చేశారు. వీటితో పాటు వరద నీటి కాల్వలకు 301 చోట్ల రూ. 134.98 కోట్లు వెచ్చించారు. మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి, ఫుట్పాత్ల నిర్మాణం, ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఇతరత్రా పనులు, 2550 పనులకు రూ. 323కోట్లు ఖర్చు చేశారు. సాధారణ పనులు (మెయింటెనెన్స్) 4516 చోట్ల పనులను తీసుకొని రూ. 915.59కోట్లు ఖర్చు పెట్టినట్లు, మిగిలిన పనులు మార్చి చివరి వరకు పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నారు.