అల్వాల్, డిసెంబర్ 27: డివిజన్ పరిధిలోని చెరువుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని అల్వాల్ కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆమె కొత్త రాయుని చెరువులో గుర్రపు డెక్క తొలగింపు పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. అల్వాల్ పరిధిలోని కొత్తరాయుని చెరువు, కొత్త చెరువుల్లోని గుర్రపు డెక్కను తొలగించి శుభ్రం చేయిస్తున్నామన్నారు. దీనివల్ల స్థానికులకు దోమల నుంచి ఉపశమనం లభించి, చెరువులు కూడా అందంగా కనిపిస్తాయన్నారు. చెరువుల్లో డ్రైనేజీ నీళ్లు కలవకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సీవరేజ్ లైన్ ఏర్పాటు పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని, అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించడకుండా స్థానికులు సహకరించాలన్నారు. కార్పొరేటర్ వెంట కవిత, అర్వింద్, హరిబాబు, శ్రీనివాస్, బాలు తదితరులు ఉన్నారు.