మాదాపూర్, జనవరి 7: సమాజంలో మహిళలను గౌరవించి వారి ప్రతిభను గుర్తించినట్లయితే మరెన్నో విజయాలు అందుకోవడం ఖాయమని పంచాయతి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. పలు రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలకు వైశ్య లైమ్ లైట్ ఆధ్వర్యంలో రాయదుర్గం దర్గాలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పంచాయతి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే బీగల గణేష్ గుప్తా, ఎమ్మెల్సీ బోగ్గారపు దయానంద్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ మాజీ చైర్మెన్ కోలేటి దామోదర్ గుప్తా, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ బొల్లం సంపత్ కుమార్, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ లక్ష్మీనారాయణ, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస, తెలంగాణ డైరీ ఫారం మాజీ చైర్మన్ సోమ భరత్లతో కలిసి మంత్రి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మహిళలకు అన్ని రంగాల్లో అవకాశం ఇస్తే ఏ విధంగా ముందుకు సాగుతారో అవార్డులు అందుకున్న మహిళలను చూస్తే అర్థమవుతుందని చెప్పారు. అనంతరం మంత్రి సీతక్క ఆయా రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలకు వైశ్య లైమ్ లైట్ అవార్డులను ప్రదానం చేశారు.