నిర్భయంగా షీ టీమ్స్కు ఫిర్యాదు చేయండి
నగర అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్
సిటీబ్యూరో, జూలై 6 (నమస్తే తెలంగాణ): మహిళలను వేధిస్తే శిక్ష పడటం ఖాయమని నగర అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ అన్నారు. షీ టీమ్స్కు వచ్చే ఫిర్యాదుల్లో నిందితులపై వెంటనే కేసు నమోదు చేసి, వారికి జైలు శిక్షలు పడే విధంగా అన్ని ఆధారాలను సేకరిస్తున్నట్లు వెల్లడించారు. షీ టీమ్స్ నిఘా నిరంతరం ఉంటుందని, మహిళలను వేధిస్తే పట్టుకుంటారన్నారు. ఎవరైనా వేధిస్తే నిర్భయంగా షీ టీమ్స్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇటీవల నమోదైన కొన్ని కేసులు, కోర్టు తీర్పులను వివరించారు. ఆ వివరాలివి.. ఓ బాధితురాలికి ఆగంతకుడు అశ్లీల వీడియోలు పంపిస్తున్నాడు.
ఆ నంబర్ను బ్లాక్ చేసినా.. మరో నంబర్తో మానసికంగా వేధిస్తుండడంతో ఆమె షీ టీమ్స్ను ఆశ్రయించింది. దర్యాప్తులో నిందితుడు మల్లెపల్లికి చెందిన రైసుద్దీన్(58)గా గుర్తించి పట్టుకున్నారు. బోయిన్పల్లి ఠాణాలో కేసు నమోదు కావడంతో నిందితుడిని అక్కడి పోలీసులకు అప్పగించారు. ఫేస్బుక్ నుంచి బాధితురాలి ఫొటోలు సేకరించి.. వాటిని మార్ఫింగ్ చేసి..బ్లాక్ మెయిల్ చేస్తున్న మిర్యాలగూడకు చెందిన దివాకర్ను షీటీమ్స్ పట్టుకుంది. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా, 5 రోజుల జైలు శిక్ష పడింది.