Illegal Constructions | సిటీబ్యూరో, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): ‘అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..నిబంధనలకు మించి నిర్మాణం చేపడితే నోటీసులు ఇచ్చి సదరు నిర్మాణాన్ని నేలమట్టం చేస్తాం’..ఇది బల్దియా టౌన్ప్లానింగ్ అధికారులు, కమిషనర్ చెప్పే మాట..కానీ క్షేత్రస్థాయిలో మాత్రం కాసులకు కక్కుర్తి పడుతూ అక్రమార్కులకు అధికారులు కొమ్ముకాస్తున్నారు. ప్రమాదకరంగా నిర్మాణాలు జరుగుతున్నా.. బాధ్యతగా వ్యవహరించడం లేదు.
అనుమతులు ఇచ్చి వదిలేస్తున్నారు. కానీ అనుమతి పొందిన నిర్మాణదారుడు అనుమతులకు విరుద్ధంగా సెల్లార్లు, అదనపు అంతస్తులతో చెలరేగిపోతున్నా..ఆ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఫిర్యాదు చేసినా..ఒత్తిడి తెచ్చినా.. కేవలం నోటీసులతో సరిపెడుతున్నారే తప్ప.. ఆపై చర్యలకు వెళ్లడం లేదు. ఇదే సమయంలో సదరు షోకాజ్ అందుకున్న నిర్మాణదారుడు డబ్బులిస్తే చాలు ..కొందరు అధికారులు ఆ నిర్మాణం జోలికి వెళ్లడం లేదు. అదేమని అడిగితే సరైన ఎన్ఫోర్స్మెంట్ లేదని స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారులు చెబుతున్నారు.
ప్రశాంత్హిల్స్లో సర్వే నంబర్ 66/2లో రహదారిని ఆక్రమించిన రిటైర్డ్ అధికారి భవన నిర్మాణాన్ని చేపడుతున్నారు. కాలనీ లే అవుట్లో సదరు నిర్మాణం జరిగే ప్రాంతం కాలనీ రహదారిగా స్పష్టంగా ఉన్నప్పటికీ దానికి ఆక్రమించి భవన నిర్మాణం కొనసాగిస్తున్నారు. కొందరు రెవెన్యూ విభాగం అధికారులను మచ్చిక చేసుకొని ఎన్వోసీని సంపాదించి.. దాని ఆధారంగా భవన నిర్మాణ అనుమతులు పొందారు. కాలనీకి చెందిన దారిని ఆక్రమించి నిర్మాణం చేపడుతున్నారంటూ కాలనీకి చెందిన అల్లగడ్డ గుర్రప్ప జీహెచ్ఎంసీ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. తక్షణమే సదరు నిర్మాణాన్ని నిలిపివేయాలని, లేని పక్షంలో ప్రజలకు, కాలనీకి ఉపయోగపడాల్సిన రహదారులు కనుమరుగవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఎన్వోసీ ఆధారంగా తాము అనుమతులను మంజూరు చేస్తామని టౌన్ప్లానింగ్ అధికారులు చెబుతుండగా, ఆ అనుమతులన్నీ గతంలో పనిచేసిన అధికారులే ఇచ్చారంటూ.. ప్రస్తుత అధికారులు చెబుతున్నారు.
సనత్నగర్ డివిజన్ బీకేగూడ సమీపంలోని ప్లాట్ నంబర్ 41లో 317 చదరపు గజాల స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాన్ని చేపట్టారు. జీహెచ్ఎంసీ నుంచి గ్రౌండ్ ప్లస్ 3 అంతస్తులకు అనుమతి పొందిన యజమాని, దానికి బదులుగా అక్కడ సెల్లార్తో పాటు నాలుగైదు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నట్లు అధికారులు క్షేత్ర స్థాయిలో పరీక్షించిన తర్వాత రూపొందించిన నివేదికలో పేర్కొన్నారు. బల్దియా నుంచి పొందిన అనుమతి వివరాలు (ప్లాన్) సైట్ వద్ద ప్రదర్శించాల్సి ఉన్నా, దాన్ని విస్మరించి అక్రమ భవన నిర్మాణ పనులు చేపడుతున్నట్లు గుర్తించారు.
నిర్మాణ భవనం చుట్టూ 4 దిక్కులా ఉండాల్సిన సెట్ బ్యాక్లు సైతం ఉల్లంఘించి నిర్మిస్తున్నారు. భవనం ముందు వైపు 3 మీటర్లు సెట్ బ్యాక్ ఉండాల్సి ఉండగా, దానికి బదులుగా కేవలం 1.4 మీటర్ల స్థలాన్ని వదిలారు. ఇలా మూడు దిక్కులా సెట్ బ్యాక్ 2 మీటర్లు వదిలి పెట్టి నిర్మించాల్సి ఉన్నా, కేవలం ఒక మీటరు స్థలాన్ని వదిలి నిర్మించినట్లు జీహెచ్ఎంసీ సైట్ పరిశీలన చేసిన సమయంలో గుర్తించి యజమానికి ఫిబ్రవరి 8న నోటీసులు సైతం జారీ చేశారు. కానీ నేటికీ చర్యలు శూన్యం. అయితే సంబంధిత అధికారులకు భారీగా ముడుపులు అందినట్లు ప్రధాన ఆరోపణ. నిబంధనలకు విరుద్ధంగా అంతస్తుల మీద అంతస్తుల నిర్మాణం జరుగుతున్నా..పట్టించుకోవడం లేదు.
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ప్రశాంత్హిల్స్లో సర్వే నంబర్ 66/2లో ప్లాట్ నంబర్ 175/పార్ట్లో ఒక ప్లాట్పై అనుమతులు తీసుకొని.. పక్కనే ఉన్న మరో ప్లాట్ను కలుపుకొని సదరు నిర్మాణదారుడి అక్రమ నిర్మాణాన్ని చేపట్టారు. అదనపు అంతస్తులు, సెట్బ్యాక్ నిబంధనలకు తిలోదకాలిచ్చారు. స్థానిక నివాసితులు గాయత్రి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం, జోనల్ కార్యాలయం అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేశారు.
అధికారులు అక్రమ నిర్మాణమని తేల్చి ఇప్పటికే సదరు నిర్మాణ సంస్థకు రెండు సార్లు కూల్చివేతకు సంబంధించి నోటీసు (నం. 1758/యూసీ/2023) జారీ చేశారు. ఓ జెడ్సీ తన అధికారాన్ని అడ్డు పెట్టుకొని నిర్మాణం కూల్చేందుకు వెళ్లిన బృందాన్ని సైతం వెనక్కి పంపించేశారు. ఫలితంగా అక్రమ నిర్మాణం పూర్తి చేసుకొని నిబంధనలకు విరుద్ధంగా హాస్టల్కు అద్దెకు ఇచ్చేందుకు యజమాని సిద్ధమవుతున్నాడు.
ఒక నిర్మాణం రాత్రి రాత్రే జరగదు. రోజుల తరబడి అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా..ముడుపుల మత్తులో పడి నిబంధనలకు టౌన్ప్లానింగ్ అధికారులు పాతర వేస్తున్నారు. పైగా నోటీసులు ఇచ్చిన నిర్మాణాల జోలికి కూడా వెళ్లకపోవడం విమర్శలకు తావిస్తోంది. సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే టౌన్ప్లానింగ్ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇష్టారాజ్యంగా అనుమతులు ఇస్తున్నారని, అక్రమ నిర్మాణాలను కట్టడి చేయాలని ఆదేశాలు జారీ చేసినా.. ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.
స్థానిక జీ+4 అంతస్తుల నిర్మాణాలే జరిగే చోట ఏడు, ఎనిమిది అంతస్తుల మేర అందులో ఎలాంటి కనీస సెట్బ్యాక్ నిబంధనలు పాటించకుండా ప్రమాదకర స్థాయిలో నిర్మాణాలు జరుగుతున్నాయి. సామాన్యుడు చిన్నగా సెట్బ్యాక్ ఉల్లంఘన జరిపితే చర్యలు తీసుకునే అధికారులు.. బడా నిర్మాణదారుల జోలికి మాత్రం వెళ్లడం లేదు. అక్రమ నిర్మాణాలతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బాధితులకు మాత్రం భరోసా దక్కడం లేదు. కమిషనర్ రోనాల్ ్డరాస్ జోక్యం చేసుకొని అక్రమ నిర్మాణాలను నిగ్గు తేల్చాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.