అన్వితారెడ్డి
ఖైరతాబాద్, మే 25 : ప్రపంచంలోని అన్ని ఖండాల్లోని ఎత్తయిన పర్వతాలను అధిరోహించడమే తన ముందున్న లక్ష్యమని పర్వతారోహకురాలు అన్వితారెడ్డి అన్నారు. ఇటీవల దిగ్విజయంగా ఎవరెస్ట్ను అధిరోహించిన ఆమె హైదరాబాద్ చేరుకున్న సందర్భంగా పంజాగుట్టలోని హోటల్ మెర్క్యూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన యాత్ర వివరాలు వెల్లడించారు. గత నెల ఏప్రిల్ మొదటి వారంలో హైదరాబాద్ నుంచి బయలుదేరి నేపాల్కు చేరుకున్నానని, ఎవరెస్ట్ పర్వతం దక్షిణం వైపు నుంచి శిఖరారోహణను ప్రారంభించానన్నారు.
తొమ్మిది రోజుల ట్రెకింగ్ తర్వాత ఏప్రిల్ 17న 5300 అడుగుల ఎత్తులో ఉన్న మాచ్ బేస్ క్యాంప్నకు చేరుకున్నానని, అక్కడి నుంచి సుమారు 7,100 మీటర్ల ఎత్తుకు మంచులో ప్రయాణించానని తెలిపారు. ఈ నెల 6న ఉదయం 9.30 గంటలకు ఎవరెస్ట్ శిఖరాన్ని (8848.86 మీటర్లు) చేరుకొని తన కల సాకారం చేసుకున్నానని వివరించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఓ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన అన్వితారెడ్డి ఎంబీఏ పూర్తిచేసింది. అన్విత గ్రూప్ ఎండీ అచ్యుతరావు బొప్పన, డైరెక్టర్ నాగభూషణం బొప్పన ఆమె యాత్రకు ఆర్థిక సాయం చేసి స్పాన్సర్లుగా వ్యవహరించగా, రాష్ట్రపతి చేతుల మీదుగా ‘టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు’ అందుకున్న కోచ్ శేఖర్బాబు వద్ద శిక్షణ పొందారు.