మియాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా తన పేరును ప్రకటించినందుకు సీఎం కేసీఆర్ (CM KCR) కు సదా రుణపడి ఉంటానని విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ( Whip Gandhi ) అన్నారు. సీఎంనమ్మకాన్ని నిలుపుకుంటూ ప్రజల అండదండలతో హ్యాట్రిక్ (Hatrick) విజయాన్ని నమోదు చేసి కేసీఆర్ కు బహుమతిగా అందిస్తానని ధీమాను వ్యక్తం చేశారు.
నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించిన సందర్భంగా తాజాగా ప్రకటించిన అభ్యర్థులు కోనేరు కోనప్ప, నల్లమోతు భాస్కర్రావులను స్థానిక నాయకులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. హైదర్నగర్, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్లు నార్నె శ్రీనివారావు, హమీద్ పటేల్ సహా ఆయా డివిజన్ల పార్టీ శ్రేణులు, కాలనీ వాసులు, ముస్లీం, క్రిస్టియన్ మత ప్రతినిధులు పెద్ద సంఖ్యలో విప్ గాంధీ నివాసానికి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ (Minister KTR) ల తోడ్పాటుతో రూ. 9 వేల కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులను చేపట్టానని వివరించారు. వందలాది ఐటీ కంపెనీలకు నిత్యం లక్షలాది ఉద్యోగుల రాకపోకలు సులువుగా కొనసాగేలా విస్తృతమైన ఫ్లై ఓవర్(Flyovers) లు , అండర్ పాస్లు, లింక్ రోడ్లు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు.
తాగునీరు, రహదారులు, డ్రైనేజీలు, వరద నీటి కాలువలు సహా మరెన్నో మౌలిక వసతులను కల్పించామని తెలిపారు. రాబోయే రోజులలో మరింత అభివృద్ధి పథంలో నియోజకవర్గాన్ని నడిపిస్తానని స్పష్టం చేశారు.