వివాహాలు ఆగిపోయాయి.. గృహాప్రవేశాలూ నిలిచిపోయాయి.. భవిష్యత్ కలలూ చెదిరిపోతున్నాయి.. నిషేధిత జాబితా పేరు చెబితే.. నగరవాసులు హడలిపోతున్నారు. ఏ నగరవాసి హాయిగా గుండెమీద చెయ్యి వేసుకొని.. నిద్రపోయే పరిస్థితి ఉండటం లేదంటే.. అతిశయోక్తి కాదేమో. వేతన జీవులు, పేద మధ్యతరగతి ప్రజలు కష్టపడి పైసాపైసా కూడబెట్టుకొని సంపాదించుకున్న ఆస్తులపై హక్కులు కోల్పోవడం జీర్ణించుకోలేకపోతున్నారు. 22ఏ కారణంగా కొనుగోళ్లు, అమ్మకాలు నిలిచిపోవడంతో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో ఇండ్లు కొనుక్కున్నవారు.. అమ్ముకున్నవారు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. నగరంలో ఏ నలుగురిని కదిలించినా.. కనీసం ఇద్దరి పరిస్థితి అదే తరహాలో ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. ప్రభుత్వం 22ఏ జాబితా నుంచి ప్రజల ఆస్తులను తొలగిస్తున్నామని ప్రకటిస్తున్నా.. క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలుకు నోచుకోకపోవడం మరింత మనోవేదనకు గురిచేస్తున్నది.
-సిటీబ్యూరో, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ)
నిషేధిత జాబితా ప్రజల పాలిట శాపంగా మారింది. ఆ పేరు వింటేనే ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలు హడలిపోతున్నారు. కష్టపడి పైసా పైసా కూడబెట్టుకుని సంపాదించుకున్న ఆస్తులపై హక్కులు కోల్పోయి వేలాది మంది ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నిషేధిత జాబితా ప్రభావంతో వందలాది కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. సుదీర్ఘకాలానికి వేసుకున్న జీవిత ప్రణాళికలు తలకిందులవుతున్నాయి. వేతన జీవులు, పేద మధ్యతరగతి ప్రజలు తమ పిల్లల భవిష్యత్తు కోసం కూడబెట్టుకున్న ఆస్తులపై అకారణంగా హక్కులు కోల్పోయి అయోమయంలో బతుకీడుస్తున్నారు. ప్రభుత్వ పెద్దల స్వలాభాల కోసం తమ ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టడంతో సామాన్య ప్రజల సొంతింటి కలలు చెదిరిపోతున్నాయి.
కష్టపడి కొనుక్కున్న ఇండ్లను తమ అభిరుచులకు తగ్గట్టుగా తీర్చిదిద్దుకున్నా గృహ ప్రవేశం చేయలేని దర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించుకున్న ఇండ్లకు రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. ఇండ్లు కొనుకున్నవారు.. అమ్ముకున్నవారు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. నగరంలో ఏ నలుగురిని కదిలించినా.. కనీసం ఇద్దరి పరిస్థితి ఏదే తరహాలో ఉన్నాయి. ప్రభుత్వం 22ఏ జాబితా నుంచి ప్రజల ఆస్తులను తొలగిస్తున్నామని ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలుకు నోచుకోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్లోని మోతీనగర్కు చెందిన ఓ మధ్యతరగతి కుటుంబానికి నిషేధిత జాబితా శాపంగా మారింది. జీవిత కాలమంతా కూడబెట్టుకున్న డబ్బులతో నిర్మించిన ఇంటిని అమ్మేసి కూతురు వివాహం చేయాలని నిర్ణయించారు. పెండ్లి సంబంధం చూసి వివాహ తేదీని ఖరారు చేసుకున్నారు. ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బుతో బంధుగణాన్ని పిలిచి కూతురు వివాహం వైభవంగా చేయాలనుకున్నారు. ఇంటిని రూ.1.4 కోట్లకు అమ్మకానికి పెట్టి కొనుగోలు చేసిన వారి నుంచి రూ.10 లక్షలు అడ్వాన్సుగా తీసుకున్నారు. ఆ డబ్బులతో పెండ్లికి సంబంధించిన పనులను ప్రారంభించారు. కొనుగోలు చేసిన వారికి రిజిస్ట్రేషన్ చేయడానికి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లారు.
పత్రాలన్నీ పరిశీలించిన రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది.. మీ ఇల్లు నిషేధిత జాబితాలో ఉన్నది రిజిష్ర్టేషన్ చేయడం కుదరదని తేల్చిచెప్పారు. దీంతో వారు కంగుతిన్నారు. పక్కా పట్టా భూమిలో అన్ని పత్రాలున్న స్థలంలో నిర్మించిన ఇల్లు నిషేధిత జాబితాలో ఉండటమేంటని అధికారులను నిలదీశారు. తమకేమీ తెలియదని.. కలెక్టర్ కార్యాలయంలో అడగాలని అధికారులు సమాధానమిచ్చారు. ఒక్కసారిగా కూతురు పెండ్లి వైభవంగా చేయాలని కన్న కలలన్నీ కల్లలుగా మారాయి. నిషేధిత జాబితా అని చెప్పడంతో కొనుగోలు చేయాలనుకున్నవారు వెనక్కి తగ్గారు. ఇల్లు కొనబోమని అడ్వాన్సు తిరిగిచ్చేయాలని తేల్చిచెప్పారు. దీంతో ఆ ఇంటి యజమాని ఇప్పుడు కలెక్టరేట్ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు.