పీర్జాదిగూడ, డిసెంబర్ 22 : కార్పొరేషన్ పరిధిలోని ప్రతి డివిజన్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు పీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ వెంకట్రెడ్డి అన్నారు. గురువారం కార్పొరేషన్ పరిధి… 21వ డివిజన్ స్వరాజ్ నగర్కాలనీలో ఆయన పర్యటించి కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… రోడ్డు నిర్మాణ పనులతో పాటు కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
అందుబాటులో కొవిడ్ వ్యాక్సినేషన్..
కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు కొవిడ్-19 మహమ్మారి నుంచి కాపాడేందుకు పీహెచ్సీ, బస్తీ దవాఖానలో మేడిపల్లి, పర్వతాపూర్ ప్రాంతాల్లో కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నదని మేయర్ తెలిపారు. ప్రతిరోజు ఉదయం 10 నుంచి 1 గంట వరకు వ్యాక్సినేషన్ కొనసాగుతుందని, మొదటి, రెండో డోస్తో పాటు బూస్టర్డోస్ కూడా అందుబాటులో ఉన్నదని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవం
పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధి… మేడిపల్లిలోని సేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంత ఐఏఎస్ డాక్టర్ దాసరి శ్రీనివాసులు, స్థానిక మేయర్ వెంకట్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ రోహిత్రెడ్డి, విద్యార్థులు , తదితరులు పాల్గొన్నారు.