రవీంద్రభారతి, ఆగస్టు 26: అంధులైన ఆటగాళ్ళు మనోధైర్యంతో అన్ని రంగాలలో రాణిస్తున్నారని స్పోర్ట్స్ అధారిటీ చైర్మన్ ఆంజనేయులు గౌడ్ అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రికెట్ అసోసియేషన్ బ్లైండ్ ఇన్ తెలంగాణ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని శనివారం రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి పలు క్రీడల్లో ప్రతిభ కనబర్చిన 30 మంది బ్లైండ్ విద్యార్థులకు జ్ఞాపికలు అందించి, అనంతరం, ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ అంధులు ఆత్మైస్థెర్యంతో అన్ని రంగాలలో రాణిస్తున్నారని చెప్పారు.
ప్రతిభకు అంధ్వత్వం అడ్డురాదని, ప్రతిభ ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చునని ఆయన పేర్కొన్నారు. దివ్యాంగ ఆటగాళ్ళకు ఎల్బీ స్టేడియంలో ఒక ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అంతే కాకుండా వారికి అన్ని క్రీడా టోర్నమెంట్లో పాల్గొనే విధంగా అవకాశాలను కల్పిస్తామన్నారు. ఈ అవార్డులు పొందిన దివ్యాంగ క్రీడాకారులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన క్రికెట్ అసోసియేషన్ బ్లైండ్ ఇన్ తెలంగాణ ప్రధాన కార్యదర్శి డాక్టర్ చిక్కా హరీశ్ కుమార్ను ప్రత్యేకంగా అభినందించారు. సభకు ముందు పలువురు అంధ విద్యార్థులు సినీ గీతాలు, జానపద గీతాలు ఆలపించి సభికులను ఆనందడోలికల్లో ముంచెత్తారు. ఈ కార్యక్రమంలో వివేక్ వెంకటస్వామి పలువురు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.