రవీంద్రభారతి, డిసెంబర్ 21 : జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి పేర్కొన్నారు. గురువారం రవీంద్రభారతిలో టీమ్ జేఎన్జే నిర్వహించిన జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ మాక్ హౌసింగ్ సొసైటీ విస్తృతస్థాయి సమావేశానికి మల్లు రవి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సమావేశానికి హాజరుకాలేకపోయిన రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు జేఎన్జే జర్నలిస్ట్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని.. ఆయా సభ్యులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదేనని సమావేశానికి పంపిన సందేశంలో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జేఎన్జే వ్యవస్థాపక సభ్యుడు పీవీ రమణారావు మాట్లాడుతూ ఇండ్ల స్థలాల సమస్య పరిష్కారం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. జేఎన్జే సొసైటీకి ఇండ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలుపుతూ.. సొసైటీకి చెందిన 70 మంది సభ్యుల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు కె.మంజుల, బాలినేని నాగభూషణ రావు, బోడపాటి శ్రీనివాస రావు, టాటా శ్రీనివాస్, చిత్ర, తాహీర రుమాని, హసన్ షరీఫ్, నర్సింగ్ రాజ్, శ్రీచంద్ర, మారేపల్లి లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.