హైదరాబాద్ : చారిత్రక కట్టడాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సోమవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ఎంజీ రోడ్లో గల మహాత్మాగాంధీ విగ్రహం, బన్సీలాల్ పేటలోని పురాతన మెట్ల బావి వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి తలసాని వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.
మెట్లబావి చుట్టూ తిరిగి పనులను పరిశీలించిన మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. అభివృద్ధి పనులకు అడ్డంకిగా ఉన్న విద్యుత్ స్తంభాలను వేరొక చోటకు తరలించాలని ఆదేశించారు. రోడ్డు నిర్మాణానికి ముందే వాటర్, సీవరేజ్ లైన్ పనులు ఉంటే పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో నగరంలోని మెట్ల బావులన్నింటిని పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. మెట్ల బావి పరిసరాలను ఎంతో సుందరంగా తీర్చిదిద్దుతామని, పర్యాటకులను ఆకర్షించే విధంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఆగస్టు 15 నాటికి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలిచే పురాతన నిర్మాణాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. గాంధీ విగ్రహం వద్ద అభివృద్ధి పనులను కూడా ఆగస్టు 15 నాటికి పూర్తి చేసేలా కార్యాచరణతో పని చేస్తున్నట్లు తెలిపారు.
మంత్రి వెంట కార్పొరేటర్ హేమలత, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీసీ ముకుంద రెడ్డి, ఈఈ సుదర్శన్, మెట్ల బావి పునరుద్ధరణ పనుల పర్యవేక్షకురాలు కల్పన, ఎలక్ట్రికల్ డీఈ శ్రీధర్, వాటర్ వర్క్స్ జీఎం రమణారెడ్డి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ క్రిస్టోఫర్ తదితరులు ఉన్నారు.