ఉస్మానియా యూనివర్సిటీ, మే 3 :ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడూ గీత కార్మికులను గుర్తించలేదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ గౌడలను గుర్తించి వారి అభివృద్ధికి బడ్జెట్లో నిధులు కేటాయించారని, సీఎం కేసీఆర్ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందని పాపన్న సేన పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వట్టికూటి రామారావుగౌడ్ కొనియాడారు. ఇప్పటివరకు అన్ని ప్రభుత్వాలు గీత కార్మికులను కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణించాయని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వారి సంక్షేమం కోసం ప్రణాళికలు రచించిందని తెలిపారు. గీత కార్మికుల సంక్షేమం కోసం రూ.వంద కోట్లతో ప్రత్యేక పథకానికి రూపకల్పన చేయాలని నిర్ణయించారని ప్రశంసించారు. తాజాగా రైతు బీమా పథకంలా గీత కార్మికులకు రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారని కీర్తించారు. కల్లుపై ఉన్న అపోహలను దూరం చేస్తూ, గీత కార్మికుల ఉత్పత్తులను అమ్మేందుకు హుస్సేన్సాగర్ తీరాన, నెక్లెస్ రోడ్డులో ప్రతిష్టాత్మకంగా నీరా కేఫ్ను నిర్మించినందుకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని గౌడ్ కులస్తులంతా బీఆర్ఎస్కు అండగా నిలబడతారని స్పష్టం చేశారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం నిధులు కేటాయించి, రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా రూపొందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు.
అడగకుండానే వరాలు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం
ప్రజలు పడుతున్న కష్టాలను గుర్తించి అడగక ముందే వరాలు ఇచ్చే దేవుడు కేసీఆర్ అని మైలార్దేవ్పల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ టి.ప్రేమ్దాస్ గౌడ్ అన్నారు. సిపాయి అన్నలకు 5లక్షల బీమా పథకాన్ని ప్రకటించడంపై గౌడ కులస్తులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం డివిజన్ పరిధిలోని దుర్గానగర్ దేవాలయం సమీపంలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ చిత్ర పటాలకు మైలార్దేవ్పల్లి గౌడ సంఘం సభ్యులు క్షీరాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కల్లుగీత కార్మికులను ఆదుకునేందుకు నీరా పాలసీని తీసుకువచ్చి గౌడ కులస్తుల సంక్షేమానికి కృషి చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశలో ప్రయాణించాలంటే మరోసారి గులాబీ జెండా ఎగురువేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రేమ్దాస్గౌడ్ , సుధాకర్గౌడ్ , రవిగౌడ్, శ్రీధర్గౌడ్, శ్రీనివాస్గౌడ్, బాలకృష్ణగౌడ్, నగేశ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.