సిటీబ్యూరో, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): నగరంలో వరుస స్నాచింగ్లకు పాల్పడిన యూపీ, బవారియా గ్యాంగ్ సభ్యుడు మంగళ్ను రాచకొండ పోలీసులు విచారించి కీలక సమాచారాన్ని రాబట్టారు. జనవరి 7న జంట పోలీసు కమిషనరేట్లలో వరుస స్నాచింగ్లకు పాల్పడిన యూపీ, బవారియా గ్యాంగ్.. రెండు గంటల వ్యవధిలో ఏడు ప్రాంతాల్లో స్నాచింగ్లకు పాల్పడి 21 తులాల బంగారాన్ని దోచుకొని, పారిపోయిన విషయం తెలిసిందే. పంకజ్ అలియాస్ పింక్ నేతృత్వంలో సాగుతున్న ఈ దోపిడీ గ్యాంగ్లో మంగళ్, దీపక్ అలియాస్ సేవ్వాగ్, సేవజ్ అలియాస్ లక్ష్మణ్ సభ్యులుగా ఉన్నారు.
ఈ నలుగురు గత నెల 7న ఉదయం 4 గంటల ప్రాంతంలో రైలు దిగి కొద్దిసేపు నాంపల్లి రైల్వే స్టేషన్ పరిసరాల్లో తిరిగారు. పింకు, మంగళ్ ఆటో ఎక్కి వెళ్లిపోగా, దీపక్, లక్ష్మణ్ అక్కడే ఉన్నారు. ఈ నలుగురు ఫోన్లు వాడారు. నగరంలో స్నాచింగ్లు చేసిన తర్వాత తిరిగి అక్కడే కలుసుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే పింక్, మంగళ్ ఆటోలో చార్మినార్ వద్దకు వెళ్లారు. అక్కడ ఒక మ్యాస్ట్రో బైక్ను అపహరించి, దానిపై నాంపల్లి రైల్వే స్టేషన్ వరకు వచ్చారు. అక్కడ మ్యాస్ట్రో బైక్ వదిలేసి పల్సర్ వాహనాన్ని అపహరించి.. ఆ వాహనంపై ఉప్పల్కు వెళ్లారు.
అక్కడి నుంచి స్నాచింగ్లు మొదలు పెట్టి.. వరుసగా ఉప్పల్, నాచారం, చిలకలగూడ, రాంగోపాల్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలో తమ చేతివాటాన్ని చూపించి పారిపోయారు. స్నాచింగ్లు చేసిన తర్వాత అందరూ నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద కలుసుకున్నారు. సీసీ కెమెరాల్లో పోలీసులకు దొరకకుండా ఉండేలా నగరంలో కొద్దిసేపు తిరుగుతూ కాజీపేట వెళ్లారు. అక్కడ కేరళ ఎక్స్ప్రెస్ ఎక్కి ఢిల్లీ పారిపోయారు. చోరీ సొత్తు మొత్తం లక్ష్మణ్ తీసుకోగా, మిగతా ముగ్గురు తమ స్వగ్రామాలకు వెళ్లిపోయారు. ఈ విషయాన్ని పోలీసుల విచారణలో మంగళ్ వెల్లడించాడు.
మంగళ్ను పీటీ వారెంట్పై అరెస్ట్ చేసి తీసుకొచ్చిన రాచకొండ పోలీసులు, కోర్టు అనుమతితో తొమ్మిది రోజుల పాటు విచారించి, చైన్ స్నాచింగ్ గ్యాంగ్కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించారు. కాగా, చోరీకి గురైన సొత్తుతోపాటు మిగతా గ్యాంగ్ సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడిపై జంట పోలీసు కమిషనరేట్ల పరిధిలోని ఐదు పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నాయి. ఆయా కేసుల్లో పీటీ వారెంట్పై అరెస్ట్ చేసి, విచారించేందుకు సిద్ధమవుతున్నారు.