Hussain Sagar | సిటీబ్యూరో, ఫిబ్రవరి 24(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగర పర్యాటక కేంద్రంగా ఉన్న హుస్సేన్ సాగర్లో రోజు రోజుకూ నీటి నాణ్యత పడిపోతుంది. యథేచ్ఛగా కలుస్తున్న మురుగు నీరు, వర్షపు నీటి ప్రవాహం తగ్గిపోవడంతో నీటిలో మార్పులొస్తున్నాయి. తాజాగా పడిపోతున్న నీటి నాణ్యతపై పీసీబీ వెల్లడించిన నివేదికలోనూ వెల్లడి కాగా, అధికారులు తీసుకునే చర్యలతో హుస్సేన్ సాగర్లో జీవజాలం మనుగడ ప్రమాదంలో పడేలా ఉంది. అయితే, పదేళ్ల క్రితంతో పోలిస్తే హైదరాబాద్ హుస్సేన్ సాగర్ మెరుగుపడినా, నీటి నాణ్యతను మెరుగుపరిచేలా ప్రత్యేక కార్యాచరణ అవసరమని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు.
పడిపోతున్న నాణ్యత
యథేచ్ఛగా కలుస్తున్న మురుగునీటితో నగరం నడి బొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నీటి నాణ్యత పడిపోతుంది. దీంతో పాటు కాలుష్య కారకాలు, మురుగు నీటిలో ఉండే లోహ మిశ్రమాలతో పాటు, బంజారా నాలా ద్వారా విడుదలవుతున్న శుద్ధి చేయని డ్రైనేజీ నీటితో రిజర్వాయర్ పర్యావరణం దెబ్బ తింటుంది. 2023లో రూపొందించిన పీసీబీ నివేదిక ప్రకారం, హుస్సేన్ సాగర్కు కీలకమైన నెక్లెస్ రోడ్డు ప్రాంతంలో నీటి నాణ్యత దారుణంగా ఉందని తేలింది. ప్రధానంగా బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్తో పాటు, ఘన వ్యర్థాలు, కోలిఫాం నిర్ణీత ప్రమాణాల కంటే ఎక్కువ మొత్తంలో ఉందని వెల్లడైంది. అయితే, నీటి పీహెచ్ లెవల్ 6.63-7.63 మధ్య స్థిరంగానే ఉండగా, ఎలక్ట్రికల్ కండెక్టివిటీ(ఈసీ) విలువ అధికంగా ఉండటం నీటిలో ఉండే ఖనిజ లవణాలకు ప్రామాణికమని పీసీబీ వర్గాలు వెల్లడించాయి.
జలావరణానికి ప్రమాదం…
క్రమంగా నీటి నాణ్యత పడిపోవడానికి ప్రధాన కారణాలుగా శుద్ధి చేయని మురుగు నీరు యథేచ్ఛగా చేరడంతో పాటు, మానవ వ్యర్థాల పరిమాణమని పీసీబీ వర్గాలు చెబుతున్నాయి. నీటిలో బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ పడిపోతే గనుక జలావరణానికి ప్రమాదంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. బంజారాహిల్స్ నాలా నుంచి వచ్చే మురుగు నీటితోనే హుస్సేన్ సాగర్లో నీటి నాణ్యత తగ్గుతుందన్నారు. అయితే, హుస్సేన్ సాగర్ జలాలను పరిరక్షించాలంటే సమర్థవంతంగా పనిచేసే ఎస్టీపీలతో పాటు, నిరంతరం ప్రవహించే మంచినీరు, లేదా 100 శాతం శుద్ధి చేసిన మురుగునీటితోనే సాధ్యమని, దీంతో పాటు ఏటా వేసవిలో ఆవిరైపోతున్న నీటితో కూడా నాణ్యత కొంత మేర తగ్గుతుందని పీసీబీ అధికారులు చెబుతున్నారు.