అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న జీహెచ్ఎంసీ వ్యర్థాల నుంచి సంపదను సృష్టిస్తున్నది. ఇప్పటికే పారిశుధ్య, భవన నిర్మాణ, కూల్చివేతల నుంచి వచ్చే వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి పునర్వినియోగంలోకి తెస్తుండగా.. ఇక పారిశుధ్య నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తెచ్చి జవహర్నగర్ డంపింగ్ యార్డులో కరెంట్ను ఉత్పత్తి చేస్తున్నది. ప్రస్తుతం అక్కడ 20 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ అందుబాటులోకి రాగా త్వరలో మరో 20 మెగావాట్ల ప్లాంటునూ నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
భవన నిర్మాణాల వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసి వినియోగంలోకి తెచ్చేందుకు జీడిమెట్ల, ఫతుల్లాగూడలో సీ అండ్ డీ(కన్స్ట్రక్షన్స్ అండ్ డిమాలిషస్) ప్లాంట్లను అధికారులు నెలకొల్పారు. నగరం నలుమూలల నుంచి భవన నిర్మాణ వ్యర్థాలను ఈ ప్లాంట్లకు తరలిస్తున్నారు. వాటి నుంచి పెద్ద, చిన్న సైజు కంకర, ఇసుకను వేరు చేస్తున్నారు. వీటిని భవనాలు, ఫ్లై ఓవర్లు, ఇతర నిర్మాణాల్లో వినియోగిస్తున్నారు. టైల్స్ను ఫుట్పాత్లతో పాటు గృహాల్లోనూ వాడుతున్నారు. మొత్తంగా మూడేండ్లలో ఒక్క జీడిమెట్లలోని సీ అండ్ డీ ప్లాంట్కు 16,74, 849 లక్షల మెట్రిక్ టన్నుల నిర్మాణ వ్యర్థాలను తరలించగా.. ఇందులో సచివాలయ వ్యర్థాలే 1.14 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నాయి.
హైదరాబాద్ ఇమేజ్ను మరింతగా పెంచేందుకు ప్రభుత్వం చేపడుతున్న విధానాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. నగర అపరిశుభ్రతకు ముఖ్య కారణమైన నిర్మాణ వ్యర్థాలకు కొత్త అర్థం చెప్పేందుకు జీడిమెట్ల (నార్త్), ఫతుల్లాగూడ(సౌత్ఈస్ట్), కొత్వాల్గూడ(సౌత్), మల్లాపూర్ (నార్త్ఈస్ట్)లో సీఅండ్ డీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తొలివిడుతగా జీడిమెట్లలో దాదాపు 15 ఎకరాల్లో రూ.12 కోట్లతో గతేడాది నవంబర్ 7న ప్లాంట్ను ఏర్పాటు చేశారు. మొత్తంగా ఇప్పటివరకు 1560449.65 మెట్రిక్ టన్నులను తరలించగా అందులో 148555 మెట్రిక్ టన్నులను పునర్వియోగానికి అనుకూలంగా మార్చారు.
ఇటీవలే ఫతుల్లాగూడలో ప్లాంట్ను అందుబాటులోకి తీసుకొచ్చిన అధికారులు అక్కడ ప్రతిరోజు 500 టన్నులను రీ సైక్లింగ్ చేస్తున్నారు. 18 ఎంఎం, 20 ఎంఎం మందం కంకర, ఇసుక, కర్బ్ స్టోన్స్, బ్రిక్స్, పావింగ్ స్టోన్స్, పవర్బ్లాక్, ఫ్లోరింగ్ మెటీరియల్ను తయారు చేస్తున్నారు. అత్యాధునిక పరిజ్ఞానంతో ఏర్పాటైన ఈ ప్లాంట్లు మంచి ఫలితాలు ఇస్తున్నాయని అధికారులు వివరిస్తున్నారు. నిర్మాణ వ్యర్థాల తరలింపునకు 18001201159 టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తెచ్చిన అధికారులు త్వరలో మొబైల్ యాప్ను తీసుకువచ్చే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు.
వ్యర్థాల నుంచి విద్యుదుత్పత్తి చేయడంలో జీహెచ్ఎంసీ మెరుగైన ఫలితాలు రాబడుతున్నది. కాలుష్యానికి కారణమవుతున్న వాటిని వెలుగులిచ్చే ముడిసరుకుగా మారుస్తున్నారు. జవహర్నగర్ వద్ద ప్లాంటు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి నిత్యం 1500-1600 టన్నుల చెత్తను వినియోగిస్తూ విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. 50% ఉన్న ఈ ప్లాంట్ సామర్థ్యాన్ని ప్రస్తుతం 65%కి పెంచారు. మరో 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ను నెలకొల్పనున్నారు.