కాసుల కోసం ప్రజల ప్రాణాలతో వ్యాపారుల చెలగాటం
వనపర్తిలో తయారీ.. హైదరాబాద్లో విక్రయం
దాడులు జరిపి పట్టుకున్న ఎస్ఓటీ పోలీసులు
ముగ్గురు అరెస్టు, 480 లీటర్ల పాలు స్వాధీనం
సిటీబ్యూరో, ఏప్రిల్ 7(నమస్తే తెలంగాణ) : మీ బట్టలు తళతళ మెరువాలంటే వాషింగ్ పౌడర్ను వాడండి.. ఈ ప్రకటన మనం పత్రికల్లో, టీవీల్లో చూస్తూనే ఉంటాం. కాని అదే వాషింగ్ పౌడర్ను పాల విక్రయదారులు ఉపయోగిస్తున్నారు. ఇది ప్రమాదకరమని తెలిసినా కాసులకు కక్కుర్తి పడుతున్న వ్యాపారులు వీల్ పౌడర్ను పాలల్లో కలిపి నురుగలు కక్కేలా చేసి ఆ పాలను బహిరంగ మార్కెట్లో విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. బీబీనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వనపర్తి గ్రామంలో తయారు చేసిన వీల్ పౌడర్ కలిపిన పాలను హైదరాబాద్లోని నాంపల్లి, గుడ్డిమల్కాపూర్, ఉప్పల్, రామాంతపూర్ ప్రాంతాల్లోని మిఠాయి దుకాణదారులకు విక్రయిస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న రాచకొండ భువనగిరి ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ రాములు బృందం వనపర్తిలోని మెడబోయిన బాలయ్య, శ్రీశైలం, మహేశ్ ఇండ్లలో సోదాలు జరిపి దాదాపు 480 లీటర్ల కల్తీ పాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా.. 50 లీటర్ల అసలు పాలలో డిటర్జెంట్ పౌడర్, హైడ్రోజన్ పెరాక్సైడ్, ఇతర రసాయనాలను కలిపి రెండింతలు పాలను తయారు చేసి విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ కల్తీ పాలు తాగితే కిడ్నీలు పాడవడంతో పాటు ఇతర రోగాల బారిన పడడం ఖాయమని పోలీసులు తెలిపారు. 6 నెలలుగా ఈ సాగుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.