సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో పరిపాలన వికేంద్రీకరణకు సర్కారు తీసుకున్న వార్డు కార్యాలయాలు వడివడిగా రూపుదిద్దుకుంటున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్లే ఉద్దేశంతో హైదరాబాద్ నగరంలో పరిపాలనను మరింతగా పౌరులకు చేరువ చేయాలన్న లక్ష్యంగా వచ్చే నెల 1 నుంచి వార్డు పాలన వ్యవస్థ అమలుకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుడుతున్నది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 150 వార్డుల్లో ఈ వార్డు ఆఫీసుల ఏర్పాటు, వార్డు ఆఫీసులలో సుమారు పదిమంది అధికారుల నియామకం ప్రక్రియను పూర్తి చేసింది.
పది మందిలో వార్డు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, వార్డు ఎంటమాలజిస్ట్, వార్డు ఇంజినీర్, వార్డు టౌన్ప్లానర్, వార్డు కమ్యూనిటీ ఆర్గనైజర్, వార్డు శానిటరీ జవాన్, వార్డు అర్బన్ బయోడైవర్సిటీ సూపర్వైజర్, వార్డు కంప్యూటర్ ఆపరేటర్, వార్డు రిసెప్షన్, జలమండలి అధికారులు, టీఎస్ ఎస్పీడీసీఎల్ అధికారులు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇందులో భాగంగానే వార్డు పరిపాలన అధికారులుగా సహాయ మున్సిపల్ కమిషనర్లు (ఏఎంసీ), సూపరింటెండెంట్లు, ఇంజినీర్లను ఇప్పటికే నియమిస్తూ కమిషనర్ లోకేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలోనే కమ్యూనిటీ హాళ్లు, మోడల్ మార్కెట్లు, ప్రైవేట్ బిల్డింగ్లను గుర్తించి వాటికి రంగులద్ది, సామాగ్రిని సమకూర్చారు.
ఈ నెల 25, 26వ తేదీల్లోగా సకల సదుపాయాలతో సిద్ధం చేసేలా ఏర్పాట్లు వేగిరం చేశారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకుగాను ఒక్కో కార్యాలయంలో సుమారు 10మంది అధికారులు కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 31న వార్డు కార్యాలయాలను ప్రారంభించి జూన్ 2వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో వార్డు సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ‘మై జీహెచ్ఎంసీ’ యాప్ ద్వారా పర్యవేక్షణ జరిపి పౌరులు అందించే ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపనున్నారు.