మహానగరంలో పరిపాలనను పౌరులకు మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో వార్డు పాలన రాబోతున్నది. జూన్ 1న ఏకకాలంలో 150 వార్డుల్లో వార్డు కార్యాలయాలను ప్రారంభించేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తున్నది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల బృందం గురువారం రంగంలోకి దిగింది. ప్రతి డివిజన్లో సిటిజన్ ఫ్రెండ్లీ కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ప్రజల ఫిర్యాదులు, సమస్యలను వేగంగా పరిష్కరించే విధంగా సాంకేతికతను జోడిస్తున్నారు. ఎస్ఎంఎస్లు, ప్రత్యేక యాప్ల ద్వారా పౌరుల సమస్యలకు సత్వర పరిష్కార మార్గాలను సూచించనున్నారు.
సిటీబ్యూరో, మే 4 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్లే ఉద్దేశంతో హైదరాబాద్ నగరంలో పరిపాలనను మరింతగా పౌరులకు చేరువ చేయాలన్న లక్ష్యంగా వార్డు పాలనా వ్యవస్థ ఏర్పాటుకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుడుతున్నది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 150 వార్డుల్లో ఈ వార్డు ఆఫీసులను ఏర్పాటు చేయాలన్న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల బృందం గురువారం రంగంలోకి దిగింది. వచ్చే నెల 1న ఏకకాలంలో వార్డు కార్యాలయాలను ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి డివిజన్లో సిటీజన్ ఫ్రెండ్లీ కార్యాలయాలను ఏర్పాటుకు నడుం బిగించారు. వార్డు పాలనా వ్యవస్థ ఉద్దేశాలు, లక్ష్యాలను, అది పనిచేసే తీరును ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడమే లక్ష్యంగా అందరికీ అందుబాటులో వార్డు కార్యాలయాల ఏర్పాటుపై దృష్టి సారించారు.
ఈ మేరకు కమ్యూనిటీ హాళ్లు, మోడల్ మార్కెట్లు, ప్రైవేట్ బిల్డింగ్లను గుర్తించి వీటిలో వార్డు ఆఫీసులు ఉండేలా చర్యలు చేపడుతున్నారు. అన్ని కార్యాలయాలు ఒకేలా ఉండడం, పచ్చదనం, పరిశుభ్రతలో ఈ కార్యాలయాలను ఆవిష్కృతం చేయనున్నారు. మీ సేవా కేంద్రాలు, పౌర సేవా కేంద్రాలను అనుసంధానం చేస్తారు. ఆఫీసులకు ప్రత్యేక లోగో, ఆకట్టుకునే ముద్ర ఉండేలా కసరత్తు చేస్తున్నారు. కార్యాలయాలలో అందే సేవల పట్టికను ప్రదర్శించనున్నారు. వీటితో పాటు ఫిర్యాదు నమోదు, పరిష్కారంపై పౌరులకు ఎప్పటికప్పుడు ఫోన్ ఎస్ఎంఎస్లు అందజేయనున్నారు. ప్రత్యేకంగా వార్డు కార్యాలయాల్లో మొబైల్ యాప్ను ఏర్పాటు చేయనున్నారు. జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్యశాఖ, విద్యుత్, జలమండలి తదితర శాఖ సేవలను అందించడం, ఆయా శాఖల సమస్యలకు సత్వర పరిష్కారానికి దోహదపడనున్నాయని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ పాలనలో పౌరుల భాగసామ్యం పెంచడమే ఈ నూతన విధాన లక్ష్యమని అధికారులు చెప్పారు.
జీహెచ్ఎంసీ ఏర్పాటు చేయనున్న ఈ వార్డు ఆఫీసుల్లో సుమారు పదిమంది క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉంటారు. సహాయ మున్సిపల్ కమిషనర్ (ఏఎంసీ) నోడల్ అధికారిగా, జీహెచ్ఎంసీలోని సహాయ ఇంజినీరు, న్యాక్ ఇంజినీరు, అర్బన్ కమ్యునిటీ డెవలప్మెంట్, శానిటేషన్, ఎంటమాలజీ, అర్బన్ బయోడైవర్శిటీ, వెటర్నరీ విభాగాల నుంచి ఒక్కో అధికారి, ఈవీడీఎం నుంచి మరొకరు కలిపి నోడల్ అధికారి కింద పని చేయనున్నారు. ఇతర ప్రభుత్వ శాఖల నుంచి ఒక్కొక్కరు వార్డు కార్యాలయాల్లో అనుసంధానమై ఉంటారు. వీరితో పాటు ప్రతి వార్డు ఆఫీస్లో డేటా ఎంట్రీ ఆపరేటర్, రిసెప్షనిస్టు, సహాయ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కార్యాలయాల్లోనే ఉంటూ పౌరులు అందించే ఫిర్యాదును స్వీకరించడం, సంబంధిత నోడల్ అధికారి పర్యవేక్షణలోని బృందం పౌరులు అందించిన సమస్యను పరిష్కారం చూపడం వంటి పనులు చేపట్టనున్నారు. కాగా, ఈ వార్డు కార్యాలయాల పనితీరును పదిహేను రోజులకోకసారి డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు సమీక్షిస్తారు.