శేరిలింగంపల్లి, నవంబర్ 25 : కులం, మతం, జాతి, ప్రాంతం వంటి ప్రలోభాలకు గురవ్వకుండా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ అన్నారు. శనివారం గచ్చిబౌలి స్టేడియంలో ‘లెట్స్ ఓట్’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఓటరు చైతన్య అవగాహన 5కే రన్’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిలతో కలిసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటు హక్కు కలిగిన ప్రతిఒక్కరూ రాబోయే ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా ప్రాముఖ్యత కలిగినదన్నారు. అర్హులైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవాలన్నారు. ఓటు పాముఖ్యతను గుర్తించి అర్హులైన అందరూ ఎన్నికల్లో ఓటు వేసేలా చైతన్యపర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. నవంబర్ 30వ తేదీన ఎన్నికల సెలవు ఇంట్లో ఉండేందుకు కాదని, బయటకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకని సూచించారు. స్వచ్ఛందంగా ఓటు వేసి మనందరం దేశం పట్ల ప్రేమ, అభిమానం చాటుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ అన్నారు. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. బాధ్యతాయుత పౌరులుగా యువతీయువకులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. లెట్స్ ఓట్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, వివిధ ఐటీ సంస్థల ఉద్యోగులు, పలు ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.