మైలార్దేవ్పల్లి,జనవరి7:కష్టంలో ఉన్న సాటి మనిషిని ఆదుకోవడమే నిజమైన దైవ సేవ అని హైకోర్టు న్యాయమూర్తి భీమపాక నగేశ్ అన్నారు. రామకృష్ణ మిషన్ 125వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో రామకృష్ణ వివేకానంద భావప్రచార పరిషత్ తెలంగాణ రాష్ట్ర స్థాయి 4వ భక్త సమ్మేళనం శనివారం కాటేదాన్లో నిర్వహించారు. రెండు రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైకోర్టు న్యాయమూర్తి భీమపాక నగేశ్ , ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ విచ్చేశారు.
వారు మాట్లాడుతూ..శ్రీ రామకృష్ణుడు సొంత మతాన్ని ఎక్కడా ప్రకటించలేదని అన్నారు. అన్ని మతాలను అంగీకరించే ఏకైక ఉదాత్తమైన మానవ సమాజం నిర్మించడానికి ఆయన ప్రయత్నం చేశారన్నారు. అన్ని మతాలలో కూడా సాటి మనిషిని ప్రేమించాలనే చెప్పారని పేర్కొన్నారు. భారతీయులలో ఉన్న ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచదేశాలకు చాటి చెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానందుడు అని కొనియాడారు.
ఆధ్యాత్మిక సూక్తులు దేశంలో ఎంతో మంది యువతకు దారి చూపించాయని అన్నారు. రామకృష్ణ పరమహంస అడుగు జాడల్లో యువత నడువాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ,రామకృష్ణ మిషన్ విజయవాడ కార్యదర్శి స్వామి హృదయానందజీ మహారాజ్ , చెన్నై రామకృష్ణ మఠం స్వామీజీ స్వామి రఘనాయకానందజీ, శితికంఠానందజీ తదితరులు పాల్గొన్నారు.