అబిడ్స్, జనవరి 14: వరుసగా సంక్రాంతి సెలవులు రావడంతో నాంపల్లిలోని అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన సందర్శకులతో కిటకిటలాడుతోంది. నగర నలు మూలల నుంచి వేలాది మంది సందర్శకులు తరలి వచ్చారు. శని, ఆదివారాలు భారీగా సందర్శకులు నుమాయిష్ సందర్శనకు తరలి రావడంతో మైదానం కిటకిటలాడింది. శనివారం నాటికి మూడు లక్షల పై చిలుకు సందర్శకులు నుమాయిష్ను సందర్శించగా, ఆదివారం కూడా దాదాపు ఎనభై వేల పై చిలుకు సందర్శకులు ఎగ్జిబిషన్లో సందడి చేశారు. ఈ నేపథ్యంలో స్టాళ్లలో భారీగా అమ్మకాలు చోటు చేసుకున్నాయి. ప్రదర్శనకు వచ్చే సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షులు వనం సత్యేందర్, కార్యదర్శి బి.హనుమంతరావు, సంయుక్త కార్యదర్శి చరణ్జిత్ సింగ్, కోశాధికారి ఏనుగుల రాజేందర్ కుమార్లు, సొసైటీ సభ్యులు సుఖేష్రెడ్డి, జీవీ రంగారెడ్డిలు మైదానంలో తిరిగి పర్యవేక్షించారు. సందర్శకులకు కనువిందు చేసేందుకు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు.