సిటీబ్యూరో, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : పార్వతి తనయుడు.. వక్రతుండుడు.. బొజ్జ గణపయ్య భక్తులను ఆశీర్వదించేందుకు మండపాలకు చేరుకున్నాడు. విఘ్నాలను తొలగించే లంబోదరుడు వాడవాడలా కొలువుదీరే సమయం ఆసన్నమైంది. చవితి అంటే చిన్నారుల నుంచి పెద్దల వరకు ఓ కొంగొత్త ఉత్సాహం.. వైవిధ్య ప్రతిమలు, మంత్రోచ్ఛరణలు, శ్రావ్యమైన గీతాలు, వాయిధ్యాల మేళవింపులు, పత్రుల అలంకరణలు.. విభిన్న రకాల ఫలహారాలు.. మొత్తంగా వినాయక చవితి పర్వదినం ప్రతి ఇంటా తేజస్సును నింపుతుంది. సాధారణంగా ఆరునెలల ముందు నుంచే నగరంలో వినాయకుడి సందడి షురూ అయ్యింది. కాగా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో వాటిల్లే ముప్పును గ్రహించిన చాలా మంది నగరవాసులు పర్యావరణహిత మట్టి ప్రతిమలకు జై కొట్టారు. చాలా మంది వారి ఇంట్లో మట్టి గణపతులను పెట్టి ఆరాధించేందుకు ప్రాధాన్యమిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.
కిటకిటలాడిన మార్కెట్లు..!!
నగరంలోని రాజేంద్రనగర్, ధూల్పేట్, హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్, ఎల్బీనగర్, కర్మన్ఘాట్ తదితర ప్రాంతాల్లో భారీ గణపతుల విగ్రహాలను వేలాది మంది కొనుగోలు చేశారు. ఎర్రగడ్డ మార్కెట్, ఎస్.ఆర్నగర్, కూకట్పల్లి, కేపీహెచ్బీ, కుత్బుల్లాపూర్, బోయిన్పల్లి, సికింద్రాబాద్ ప్రాంతాల్లో రోడ్లపైనే అమ్మకం జోరుగా సాగింది. మట్టి గణపతులకు సహజ రంగులు అద్దడంతో మరింత శోభ సంతరించుకున్నది. మట్టి గణపతులను హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, ఇతర స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా అందించారు. వినాయకుడి విగ్రహాలతో పాటు అనుబంధ సామగ్రి అంటే పూజా, ఫలహారాలు, స్వీటు షాపులు, పూలు, డెకరేషన్, మండప ఇంటీరియర్ డిజైన్స్ తదితర కొనుగోళ్లతో మార్కెట్లన్నీ సందడిని తలపించాయి. ప్రధాన రోడ్లన్నీ వినాయకుడి షాపింగ్తో కిటకిటలాడాయి.
అదిరిన అలంకరణ..!!
కాలనీలు, బస్తీలు, గేటెడ్ కమ్యూనిటీలు ఇలా అన్నింటా మండపాలను నిర్వాహకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు. ఒకరికి ధీటుగా మరొకరు తమ గణేశుడి మండపం, విగ్రహం ప్రత్యేకంగా ఉండాలని పోటీపడ్డారు. అలంకరణలోనూ ఇంటరీయర్ డిజైన్స్తో ఆకట్టుకునేలా చేశారు. ప్రత్యేక లైటింగ్, మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రతీ మండపం వద్ద ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా శివలింగాలు, ఆవుల ప్రతిమలతో పుణ్యస్థలంగా తీర్చిదిద్దారు. ఏ గల్లీ చూసినా వినాయకుడే దర్శనమిస్తూ ఆహ్వానం పలుకుతున్న అనుభూతి కలగక మానదు. పది రోజుల పాటు వినయకుడి మండపాల వద్ద కొలాహలం కొనసాగనున్నది.
గణపతి పూజకు 21రకాల ప్రతులు
పండుగ మనలో నూతనోత్తేజాన్ని నింపడంతో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదించేదిగా వినాయక చవితి నిలిచింది. గణేశుడి పూజకు ఉపయోగించే 21 రకాల పత్రులతో అనేక ఆయుర్వేద ఉపయోగాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.